ఆదివారం అనుబంధం Sat, 14 May 2011, తొలినాళ్ళలో తెలుగు నాట సినీ రంగానికి ఊపిరి పోసిన పెద్దల పేర్లను రాయమంటే, అందులో ముందు వరుసలో వచ్చే పేరు - పి.వి. దాసు. తెర మీద బొమ్మలు తేట తెలుగులో మాట్లాడడం మొదలుపెట్టిన తరువాత సినీ రంగానికి ఆయన చేసిన సేవలు అపూర్వం. సినిమా షూటింగంటే బొంబాయి, కలకత్తా, కొల్హాపూర్ల చుట్టూ తిరుగుతున్న రోజుల్లో ఆ ధోరణిని మార్చడానికి సాహసించిన మార్గదర్శి ఆయన. దక్షిణ భారతదేశాన్ని, అందులోనూ అప్పటి మన ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రాజధాని అయిన మద్రాసు మహానగరాన్ని షూటింగులకు కేంద్రంగా మలిచేందుకు గట్టి పునాది వేసిన ఘనత ఆయనది. తమిళ వాణిజ్య ప్రముఖులతో కలసి, మద్రాసులో 'వేల్ పిక్చర్స్ స్టూడియో' పేరిట చక్కటి స్టూడియో నిర్మాణం జరిపిన తెలుగు బిడ్డగా పి.వి. దాసు చిరస్మరణీయులు.
పి.వి. దాసు పూర్తి పేరు - పినపాల వెంకట దాసు. కృష్ణాజిల్లా బందరులో పుట్టి, పెరిగారు. స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్నారు. చదువు పూర్తయ్యాక ఆయన నెల్లూరులోని తమ బావ గారి దగ్గరకు వెళ్ళారు. పెట్రోలు ఏజెన్సీ వ్యాపారస్థులైన బావ గారి దగ్గర గుమస్తాగా పనిచేస్తూ, వ్యాపారంలోని మెలకువలు నేర్చుకున్నారు. అక్కడ కొన్నాళ్ళున్న తరువాత దాసు మళ్ళీ బందరుకు వచ్చేశారు. ఇదంతా 1915 నాటి సంగతి. సొంత ఊరికి వచ్చిన తరువాత ఆయన కృష్ణాజిల్లా మొత్తానికీ 'బర్మా షెల్' సంస్థ వారి కిరోసిన్, పెట్రోలు ఏజెన్సీ తీసుకున్నారు. ఆ వ్యాపారానికి తోడుగా ఓ సోడా ఫ్యాక్టరీ పెట్టారు. అలాగే, ఐస్ ఫ్యాక్టరీని నెలకొల్పి, నడిపారు. అప్పట్లో ఆయన చేసిన ప్రతి వ్యాపారమూ మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడిచింది. ఈ వ్యాపారాలే కాక, ఆయనకు సొంతంగా చాలా భూములు కూడా ఉండేవి. ఇటు వ్యాపారంలో, అటు వ్యవసాయంలో ఆయన బోలెడంత డబ్బు సంపాదించారు.
ప్రదర్శక రంగం నుంచి చిత్ర నిర్మాణానికి...
పి.వి. దాసుకు కళలంటే మహా ప్రీతి. ఆ కళాభిరుచి కారణంగా ఆ కాలంలోని ఉత్తమ కళాకారులతో, కవులతో, సాహితీవేత్తలతో ఆయన పరిచయాలు పెంచుకున్నారు. నాటక రంగ అభివృద్ధి కోసం కృషి చేశారు. పలు నాటక ప్రదర్శనల్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో మంచి నాటకాలు కావాలంటూ రచనలపై చర్చలు జరిపేవారు. ఆ రోజుల్లో నాటకానికీ, సినిమాకూ ఉన్న విడదీయరాని సంబంధం వల్ల ఆయన సహజంగానే సినీ రంగం వైపు కూడా ఆకర్షితులయ్యారు. సినీ రంగానికి తెలుగునాట ప్రాచుర్యం కల్పించాలనే కోరిక కలిగింది. అలా ఆయన మూకీ చిత్రాల రోజుల్లోనే చిత్రసీమలోకి వచ్చారు. సినిమాల ప్రదర్శన నిమిత్తం కొందరు మిత్రులను కూడగట్టుకొని, బందరులో 1925లో 'మినర్వా' హాలు నిర్మించారు. (ఇప్పటికీ అది 'మినర్వా టాకీసు' పేరుతో నడుస్తోంది). అలాగే, ఆ తరువాతి రోజుల్లో గుంటూరు జిల్లా రేపల్లెలో 'శ్రీకృష్ణా' అంటూ మరో సినిమా హాలు కట్టారు. అలా చలనచిత్రాల ప్రదర్శక రంగంలోకి వచ్చిన పి.వి. దాసు సహజంగానే కాలక్రమంలో చిత్ర నిర్మాణం వైపు మళ్ళారు. 1931 నాటికల్లా భారతదేశంలోకి టాకీలు వచ్చేసినా, తెలుగు చిత్రాలు తీసే నిర్మాతలందరూ బొంబాయి, కలకత్తా, కొల్హాపూర్ నగరాలకు వెళ్ళి, అక్కడే చిత్ర నిర్మాణం చేయాల్సి వచ్చేది.
రాజా వారి బంగళాలో రమ్యమైన స్టూడియో
మనకే మద్రాసులో స్టూడియో ఉంటే, సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయనే ఉద్దేశం పి.వి. దాసుకు కలిగింది. దాంతో, మద్రాసుకు చేరుకొని, తమిళనాట చలనచిత్ర ప్రదర్శకులైన ఎం.టి. రాజన్, స్వామి, సి.పి. సారథి, జయంతీలాల్ ఠాకూర్లనూ, అలాగే చల్లపల్లి రాజా గారి లాంటి పెద్దలనూ కలుపుకొని, 'వేల్ పిక్చర్స్'ను స్థాపించారు. వాటాల జారీతో దాన్ని 'వేల్ పిక్చర్స్ లిమిటెడ్'గా తీర్చిదిద్దారు. మద్రాసులోని తేనాంపేట ప్రాంతంలో ప్రస్తుత వీనస్ కాలనీ (ఒకప్పుడు వీనస్ స్టూడియో)కి దగ్గరలో పిఠాపురం రాజా వారికి 'డన్మోర్ హౌస్' అనే పెద్ద బంగళా ఉండేది. పి.వి. దాసు అది తీసుకొని, దానిలో 'వేల్ పిక్చర్స్' పేరున సినిమా చిత్రీకరణలకు అనువైన స్టూడియోను నెలకొల్పారు. అప్పటికి మద్రాసులో 'శ్రీనివాస సినీటోన్' అనే మరో సినిమా సంస్థ ఉంది. దక్షిణ భారతదేశంలోనే తొలి టాకీ స్టూడియో అయిన 'శ్రీనివాస సినీటోన్' ఆ సంస్థదే!
'శ్రీనివాస సినీటోన్' కన్నా ఎంతో ఉత్తమంగా, నాణ్యమైన సాంకేతిక వసతులతో 'వేల్ పిక్చర్స్ స్టూడియో' ఏర్పాటైంది. వేల్ పిక్చర్స్ స్టూడియో నిర్మాణం, నిర్వహణకు పి.వి. దాసు ఎంతో శ్రమించారు. 'వేల్ పిక్చర్స్' కంపెనీ వారు విశేషంగా పరిశ్రమించి, వ్యయానికి లెక్క చేయకుండా, ఉత్తమమైన చిత్రాలను తయారుచేయాలనే లక్ష్యంతో పాటుపడ్డారు. పైగా, వాళ్ళు స్టూడియో నిర్మించుకున్న 'డన్మోర్ హౌస్' అన్ని విధాల వాళ్ళ ఉద్యమానికి అనుకూలమైంది. స్టూడియో కోసం ఆధునిక యంత్ర సామగ్రిని చాలా వరకు తెప్పించారు. అజంతా, ఎల్లోరా చిత్తరువుల సంప్రదాయాలను అనుసరించి, వస్తు వాహనాలను విరివిగా తయారు చేయించారు. ఆంధ్రదేశంలోనూ, అరవ దేశంలోనూ ఉండే శిల్పులు, వడ్రంగుల్లో ప్రవీణులైన కొందరిని రప్పించి, స్టూడియోకు అవసరమైన సరంజామాను అమర్చుకున్నారు.
స్టూడియోకు సారథ్యం
మద్రాసులోని 'డన్ మోర్' భవనంలో కొత్తగా స్థాపించిన వేల్ పిక్చర్స్ కంపెనీ వారి స్టూడియోను 1934 జూలై 31 మంగళవారం ఉదయం 8 గంటలకు మద్రాసు రాష్ట్ర గవర్నర్ సర్ మహమ్మద్ ఉస్మాన్ సాహెబ్ బహద్దూర్ ప్రారంభించారు. పురప్రముఖులు పలువురు ఆ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 'వేల్ పిక్చర్స్' కంపెనీ డైరెక్టర్ల పక్షాన గవర్నర్ గారికి, పి.వి. దాసు సన్మానపత్రం సమర్పించారు.
'వేల్ పిక్చర్స్' సంస్థ తమ స్టూడియోలో తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాలను కూడా నిర్మిస్తూ వచ్చింది. డైరెక్టర్లు, ఇతర నిర్వాహకులను కూడా తెలుగు చిత్రాలకు తెలుగు వాళ్ళనూ, తమిళ చిత్రాలకు తమిళ వాళ్ళనూ ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో ఈ స్టూడియోలో కెమేరామన్గా కె. రామనాథ్, కళాదర్శకుడిగా ఏ.కె. శేఖర్, రచయితగా టి.ఎస్. మురుగదాస నియమితులయ్యారు.
చిత్ర నిర్మాణం, స్టూడియో ప్రారంభం కాక ముందు నుంచి స్టూడియోలోనే ఉండి, అన్ని పనులూ దాసే స్వయంగా నిర్వహించుకొనేవారు. ఆ రకంగా స్టూడియోలో సాంకేతిక విషయాలన్నిటిలో ఆయన చక్కటి పరిజ్ఞానం సంపాదించారు. ఆ పరిజ్ఞానం ఎంతటిదంటే - అవసరాన్ని బట్టి సినిమా షూటింగులో ఆయనే సౌండ్ రికార్డు చేసేవారు. ఎడిటింగ్ బాధ్యతలను కూడా ఆయనే నిర్వహించేవారు.
బందరు సమాజంలో కీలకపాత్ర
'వేల్ పిక్చర్స్' వ్యవహారంతో మద్రాసుకు తరలిరావడానికి ముందు బందరులో ఆయన కీలక భూమికలే నిర్వహించారు. బందరులో మునిసిపల్ సంఘంలో సభ్యులుగా వ్యవహరించారు. అలాగే, జిల్లా బోర్డులో కూడా సభ్యులుగా వ్యవహరించారు. పట్టణంలో ప్రముఖులుగా నిలిచారు. అయితే, 'బర్మా షెల్' ఏజెంటుగా ఉన్నప్పుడు, బందరు, రేపల్లెలో సినిమా హాళ్ళ నిర్వహణప్పుడు, పట్టణ సంఘాల్లో సభ్యులుగా ఉన్నప్పుడు కన్నా మద్రాసులో వేల్ పిక్చర్స్ నిర్మాణంతో ఆయనలో తేజం ఆరంభమైంది. వేల్ పిక్చర్స్ స్టూడియోను నిర్మించిన తరువాతి సంవత్సరాలు ఆయన జీవితంలో ఎంతో ప్రకాశవంతంగా సాగాయని చెప్పవచ్చు. ఆ స్టూడియో నిర్మాణంతో మద్రాసులో స్టూడియోల లోటు తీరడమే కాక, ఆ పతాకం నుంచి వెలువడిన 'సీతాకల్యాణము', 'శ్రీకృష్ణలీలలు' టాకీ చిత్రాలు తెలుగు టాకీలలో ఉత్తమ శ్రేణికి చెందినవిగా నిలిచాయి. ఆ రెండు మహత్తరమైన టాకీలను ప్రసాదించి, తెలుగునాటి నంతటినీ వినోదింపజేసిన నిపుణమతి - పి.వి. దాసు.
దక్షిణాది తయారీ తొలి తెలుగు టాకీ
'వేల్ పిక్చర్స్' తొలి చిత్రం - తెలుగు సినిమా 'సీతా కల్యాణము' (1934). ఆ స్టూడియోలో ప్రథమంగా నిర్మించినది కూడా ఈ చిత్రమే! ఆ రకంగా మద్రాసులో తెలుగు చలనచిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది - పి.వి. దాసు. అప్పటి దాకా ఉత్తర భారతదేశంలోని నగరాల్లో రూపొందుతున్న తెలుగు చిత్రాలకు భిన్నంగా, దక్షిణ భారతదేశంలోనే తయారైన తొలి తెలుగు చిత్రంగా 'సీతా కల్యాణము' చరిత్ర సృష్టించింది. వేల్ పిక్చర్స్ అధినేతలు తమ స్టూడియోలో పని చేయడానికి బొంబాయి, కలకత్తాల నుంచి సుశిక్షితులైన సాంకేతిక నిపుణులను పిలిపిద్దామని భావించారు. కానీ, ఈ సాంకేతిక నిపుణుల త్రయం మాత్రం అలా చేయనక్కరలేదని వారించింది. స్థానికులనే రప్పించి, వారికి అద్భుతమైన శిక్షణనిచ్చింది. రారు థియేటర్లో చీఫ్ ప్రొజెక్షనిస్టుగా పని చేసే సి.ఇ. బిగ్స్ ఈ స్టూడియోలో శబ్దగ్రహణ శాఖకు అధిపతిగా వచ్చారు. ఎంతోమంది సౌండ్ ఇంజనీర్లకు ఆయన శిక్షణనిచ్చారు. ఇలా ఎన్నో మౌలిక సదుపాయాలతో, అప్పటికి అధునాతన సాంకేతిక సౌకర్యాలతో స్టూడియో అనుపమాన స్థాయిలో ఉండేది.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను బెజవాడ సమీపంలోని కొండపల్లి దగ్గర అడవుల్లో ఔట్డోర్లో తీయడం విశేషం. అలా తెలుగు నాట ఔట్డోర్ చిత్రీకరణకు కూడా ఈ సినిమాయే శ్రీకారం చుట్టింది. 'సీతా కల్యాణము'లో వచ్చే ఊరేగింపు సీన్లు, జనకుని రాజాస్థానం వగైరా సీన్లన్నీ బెజవాడ సమీపంలో చల్లపల్లి సంస్థానంలో తీశారు. ''అప్పట్లో బెజవాడలో 'మారుతీ సినిమా', 'శ్రీదుర్గాకళామందిరం' రెండు హాళ్ళలోనూ ఏకకాలంలో 'సీతా కల్యాణము' సినిమా విడుదలైంది. నాకు తెలిసి అలా ఒకే కేంద్రంలో ఎక్కువ థియేటర్లలో సినిమా రిలీజు కావడమనేది తెలుగులో ఆ సినిమాతోనే మొదలు!'' అని అప్పట్లో తన 15 ఏళ్ళ వయస్సులో ఆ సినిమా చూసిన సంగతులను తొలితరం సినీ జర్నలిస్టు అయిన 91 ఏళ్ళ మద్దాలి సత్యనారాయణ శర్మ (ఎం.ఎస్. శర్మ) గుర్తు చేసుకున్నారు. మొత్తం మీద ఉత్తరాది వారి డబ్బులతో కాకుండా, తెలుగు వారి పెట్టుబడితో, దక్షిణాదిన రూపుదిద్దుకున్న తొలి టాకీ 'సీతా కల్యాణము' విశేష జనాదరణను పొందింది.
చిత్ర నిర్మాణ సారథిగా దాసు కృషి
వేల్ పిక్చర్స్ సంస్థ మరోపక్క 'మార్కండేయ' తదితర తమిళ టాకీలు కూడా నిర్మించింది. ఇక, వారి రెండో తెలుగు చిత్రం - 'శ్రీకృష్ణలీలలు' (1935). దానికీ సారథ్యం - పి.వి. దాస్దే! ఆయన గొప్పదనం ఏమిటంటే - ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రతిభావంతులను తెర మీదకు తీసుకువచ్చేందుకు అవిశ్రాంతమైన కృషి చేసేవారు. సరిగ్గా గమనిస్తే - 'వేల్ పిక్చర్స్'లో ఏ చిత్రానికి ఆ చిత్రం నటీనటులు మారిపోయేవారు. ప్రతి సినిమాకూ వేర్వేరు నటీనటులను తీసుకొనేవారు. 'శ్రీకృష్ణలీలలు' విడుదలప్పుడు ప్రచారం విషయంలో పి.వి. దాసు మరో కొత్త పుంత తొక్కారు. ప్రత్యేకంగా విమానం అద్దెకు తీసుకొని, ప్రముఖ పట్టణాలలో గగనతలం నుంచి కిందకు సినిమా ప్రచార కరపత్రాలను వెదజల్లే ఏర్పాట్లు చేశారు. ఆ రోజుల్లో విమానమే వింత అయితే, విమానంలో నుంచి కరపత్రాలను జారవిడవడం మరో పెద్ద వింత. ఆ వినూత్న ప్రచార వ్యూహం జనంలో పెద్ద క్రేజును సృష్టించింది.
ఆ తరువాత మూడో తెలుగు ప్రయత్నంగా, స్వీయ దర్శకత్వంలో 'శశిరేఖా పరిణయము' ('మాయాబజార్' - 1936) చిత్రాన్ని పి.వి. దాసు ప్రారంభించారు. అయితే, షూటింగ్ సగంలో ఉండగానే, దాసు హఠాన్మరణం చెందారు. వేల్ పిక్చర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.టి. రాజన్ ఆ చిత్రాన్ని పూర్తి చేసి, విడుదల చేశారు. ఆ సినిమా చివరన ''రిమెంబర్ ఇట్ ఈజ్ ఏ వేల్ పిక్చర్స్ ప్రొడక్షన్'' అంటూ ఆంగ్లంలో టైటిల్ కార్డు వేశారు. తెలుగు చిత్రాలకు అలా వేయడం కూడా అదే ప్రథమం.
మచిలీపట్నంలో ఓ సినిమా హాలు యజమానిగా మొదలై వేల్ పిక్చర్స్ స్టూడియోకు బిజినెస్ డైరెక్టర్గా ఎదిగిన పి.వి. దాసు వ్యాపారానుభవం అపారం. అలాగే, చిత్ర నిర్మాణంలోని ప్రతి చిన్న అంశం మీద ఆయనకు అమితమైన పట్టు ఉండేది. ఛాయాగ్రహణం లాంటి సాంకేతిక అంశాల్లో సైతం ఆయనకున్న పరిజ్ఞానం అపారం. జీవించిన కొద్దికాలంలోనే పి.వి. దాసు, 'సౌత్ ఇండియన్ సౌండ్ కార్పొరేషన్' అనే సంస్థను స్థాపించి, శబ్దగ్రహణానికి కావాల్సిన పరికరాలెన్నిటినో దిగుమతి చేసి, ఇతరులకు సరఫరా చేసేవారు.
కళ విషయంలో కల్లలైన కలలు
చిత్ర నిర్మాణ, దర్శకత్వ శాఖలకు సంబంధించి దాసు ఎన్నో కలలు కన్నారు. అయితే, 'శశిరేఖా పరిణయము' చిత్రాన్ని పూర్తి చేయకుండానే, ఆయన అకస్మాత్తుగా మరణించడంతో అవన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఇప్పటికి సరిగ్గా 75 ఏళ్ళ క్రితం 1936 మే 10వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మద్రాసులో పి.వి. దాసు మరణించారు. తేనాంపేటలోని వేల్ పిక్చర్స్ స్టూడియోకు ఎదురుగా ఉన్న స్వగృహంలో మరణించేనాటికి పి.వి. దాసు వయస్సు కేవలం 46 ఏళ్ళే! ఆయనకు భార్య, ఏడుగురు పిల్లలు ఉండేవారు. పి.వి. దాసు మేనల్లుడే తరువాతి రోజుల్లో ఛాయాగ్రాహకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న బందరు వాస్తవ్యుడు - పి. శ్రీధర్.
ఆదర్శాలన్నీ సఫలం కాకుండానే, దాసు మరణించిన తరువాత 'వేల్ పిక్చర్స్' ప్రాభవం కూడా క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఆ పతాకం నుంచి మళ్ళీ తెలుగు సినిమాలేవీ రాలేదు. కొన్ని తమిళ చిత్రాలను రూపొందించినప్పటికీ, చివరకు ఆ సంస్థ చిక్కుల్లో పడింది. పి.వి. దాసు మరణం తరువాత స్టూడియో నిర్వహణపై క్రమంగా నీలినీడలు పరుచుకున్నాయి. స్టూడియోను మద్రాసులోనే తేనాంపేట నుంచి గిండీ ప్రాంతానికి మార్చారు. ఆ తరువాత సంస్థ దివాళా తీసి, సాంకేతిక సామగ్రిని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్టూడియో ప్రాంతమే ఆ తరువాత 'నరసూస్ కాఫీ' అధినేతల చేతుల్లోకి వెళ్ళి, 'నరసూ స్టూడియోస్'గా అవతరించింది. ఆ తరువాత అదీ పోయింది. ఇప్పుడు ఆ స్థలమంతా గిండీ వంతెన పక్కనే క్యాంపా కోలా మైదానంగా కనపడుతుంది.
ఏమైనా, పి.వి. దాసు సారథ్యంలో మొదలైన వేల్ పిక్చర్స్ సంస్థ అప్పట్లో ఓ సంచలనం. ప్రతిభావంతులకు ఆటపట్టు. తరువాతి రోజుల్లో ప్రముఖ సంగీత దర్శకుడై, మాస్టర్ వేణుగా ప్రసిద్ధికెక్కిన బందరు కుర్రాడు మద్దూరి వేణుగోపాల్ సైతం వేల్ పిక్చర్స్లో సంగీత విభాగంలో హార్మోనిస్టుగా పనిచేసినవారే! ఎంతో కాలం చిత్రపరిశ్రమలో లేకపోయినా, లెక్కకు మించిన చిత్రాలు తీయకపోయినా సరే, తెలుగు చలనచిత్ర రంగ ప్రారంభ దినాల్లో పి.వి. దాసు ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన అవిస్మరణీయుడైంది అందుకే!
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment