apr - Thu, 8 Sep 2011, IST Share ..
Email Print ఓహో గులాబిబాలా అందాల ప్రేమమాలా, సొగసైన కురులదానా సొంపైన మనసుదానా అని ప్రేమకోసం వెంటబడే ప్రియులు, పెద్దలు నిశ్చితార్థం కుదిరిస్తే పెళ్ళికి అంగీకరించినవారు పెళ్ళి అయ్యాక కొందరు ఆ ఆరాధన అలా జీవితాంతం కొనసాగిస్తే, కొందరు ప్రేమ మత్తు దిగాక 'ఛీ ఛీ గడ్డిపూవా, మేకప్ మోసకారీ...' అనే స్థితికి చేరతారు. సరే ఇదిలా ఉంచితే...
నృత్యదర్శకుడుగా రాణించి దేవదాసు, సువర్ణసుందరి వంటి చక్కని చిత్రాలు తన దర్శకత్వ ప్రతిభతో అందించిన వేదాంతం రాఘవయ్య నటి సూర్యప్రభని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.
మిస్ మద్రాస్గా ఎంపికై, నటిగా, గాయనిగా సుప్రసిద్ధురాలైన టంగుటూరి సూర్యకుమారి పలు విదేశీయాత్రల అనంతరం ఇంగ్లండ్ కు చెందిన పెయింటింగ్ కళాకారుడు హెరాల్డ్ ఎల్విన్ని ప్రేమించి పెళ్ళిచేసుకుని అక్కడే స్థిరపడి చక్కని సంసార జీవనం గడిపారు.
దర్శకుడు తాపీ చాణక్య, నటి సురభి బాల సరస్వతిల ప్రేమ సహజీవనం కొంతకాలం కొనసాగింది.
'ఏది నిజం' చిత్రంలో హీరో అయిన నాగభూషణం తర్వాత పలుచిత్రాల్లో కామెడీ పాత్రలు, కామెడి విలన్ పాత్రలుచేసి తర్వాత కేరక్టర్ ఆర్టిస్టుగానూ రాణించారు. ఈయన ప్రదర్శించే 'రక్తకన్నీరు' నాటకం కోసం చాలా సినిమాలు వదులుకున్నారు కూడా. వేలాదిగా 'రక్తకన్నీరు' ప్రదర్శనలు ఇచ్చారు. చిత్ర నిర్మాతగాను వ్యవహరించారు. వివాహితుడైన నాగభూషణం 'రక్తకన్నీరు'లో నటించే సీత ప్రేమలోపడి ఆమెను వివాహమాడారు.
మలయాళ చిత్రరంగానికి చెందిన సీమ తెలుగు, తమిళ చిత్రాల్లోను హీరోయిన్గా చేసింది. మలయాళీ దర్శకుడు ఐ.వి.శశి కూడా కొన్ని తెలుగు చిత్రాలు డైరక్ట్ చేసారు. వీరిద్దరి ప్రేమవివాహం ఒడిదుడుకులు లేకుండానే సాగుతోంది.
విక్టరీ మధుసూదనరావుగా గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు వీరమాచనేని మధుసూదనరావు ప్రజానాట్యమండలి నుంచి సినీరంగంలోకి అడుగిడారు. ప్రజానాట్యమండలి కళాకారిణిగా సరోజనితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. వైవాహిక జీవితమూ హ్యాపీగానే కొనసాగుతోంది.
తమిళ నటి పుష్పలత, తమిళ నటుడు ఎ.వి.ఎం. రాజన్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.
'మాయదారి మల్లిగాడు, బంగారుబాబు, నేరం నాదికాదు ఆకలిది, జేబుదొంగ' వంటి చిత్రాల్లో హీరోయిన్గా రాణించిన మంజుల వివాహితుడైన నటుడు విజయ్కుమార్ని ప్రేమించి పెళ్ళాడారు. వీరికి పుట్టిన శ్రీదేవికూడా హీరోయిన్గా రాణించి వివాహం చేసుకుంది ఇటీవల.
చెల్లెలు పాత్రలు పోషించి ముత్యమంత ముద్దు, పోలీస్భార్య మున్నగు చిత్రాల్లో నాయికగా నటించి ఇటీవల కాలంలో కేరక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూన్న సీత తమిళ చిత్రనటుడు, దర్శకుడు పార్దీబన్ ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. కొన్నేళ్ళతర్వాత ఈ దంపతులు విడిపోయారు. అయినా అత్తగారు అప్పుడే కాదు ఇప్పటికీ సీతనే సమర్థిస్తూ వుంటుంది.
'భక్త ప్రహ్లాద'లో ప్రహ్లాదుడుగా నటించి తరువాత హీరోయిన్గా కొనసాగి, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ మారిన రోజారమణి ఒరియా చిత్రాల హీరోగా వుండే చక్రపాణి (తర్వాత తెలుగు చిత్రాల్లోనూ నటించారు) ల మధ్య ప్రేమ చివురించి కొంతకాలం తర్వాత వివాహబంధంకి దారితీసి ఆనందంగా కొనసాగుతోంది. తరుణ్ వీరి కుమారుడు. నటుడు నవభారత్ బాలాజీది కూడా ప్రేమ వివాహమే.
నటుడు దర్శకుడు భాగ్యరాజ్కి తొలుత ప్రవీణతో వివాహమయింది. ఆమె మరణించిన తరువాత ఆయన చిత్రాల్లో హీరోయిన్గా చేసిన పూర్ణిమా జయరామ్తో ప్రేమలో పడ్డారు. పెళ్ళి చేసుకున్నారు.
కథానాయకుడు, చిత్రనిర్మాత అయిన సురేష్ ఇటీవలి కాలంలో విలన్గా కేరక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. తొలిదశలో గాయని అనితారెడ్డిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. వీరి దాంపత్యం కొంతకాలమే సాగింది.
కన్నడ నటి అయిన భారతి నాజూకు అందాలతో తెలుగు తెరపై కూడా 'నిన్నే పెళ్ళాడుతా, గోవుల గోపన్న' తదితర చిత్రాల్లో నటించింది. కన్నడ నటుడు విష్ణువర్ధన్, ఈమె పరస్పరం ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. వీరిది ఆదర్శ దాంపత్యమే. విష్ణువర్ధన్ ఇటీవల మరణించారు.
అందాలనటి సుమలత 'రాజాధిరాజు, శుభలేఖ, ఖైదీ, రాక్షసుడు గ్యాంగ్లీడర్' తదితర చిత్రాల్లో నటించింది. ఈమె కేరక్టర్ ఆర్టిస్టుగానూ మారారు. ఈమె చేస్తున్న 'బ్రతుకు జట్కాబండి' టెలిసీరియల్ ద్వారా దాంపత్య జీవితంలో దెబ్బతిన్న వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈమె కన్నడ నటుడు అంబరీష్ని ప్రేమించారు. చాలాకాలం పాటు ప్రేమికులుగా గడిపాక అంబరీష్తో వివాహమైంది. ఆదర్శ దాంపత్య జీవితం గడుపుతున్నారు.
నటి జయప్రద నిర్మాత, పంపిణీదారుడు సుందర్లాల్ నహతా కుమారుడైన శ్రీకాంత్ నహతా (ఈయనకూడా నిర్మాత, పంపిణీదారుడు)ను ప్రేమించి పెళ్ళాడారు. శ్రీకాంత్ నహతాకు అప్పటికే పెళ్ళి అయింది. రాజకీయ రంగంలోకి వెళ్ళి నటన తగ్గించినా అప్పుడప్పుడు మెరుస్తున్నారు. టెలీ ఇంటర్వ్యూలలో కూడా అలరిస్తున్నారు.
నటి జయసుధకి పంపిణీదారుడు రమణతో తొలుత వివాహమయింది. మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత దర్శకత్వశాఖలో పనిచేస్తున్న నితిన్ కపూర్ని ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. జె.కె.కంబైన్స్ పతాకాన పలుచిత్రాలు నిర్మించారు కూడా. వీరి దాంపత్యం సజావుగా సాగుతోంది. కేరక్టర్ ఆర్టిస్టుగా, ఎం.ఎల్.ఎ.గా రాణిస్తున్నారు.
హీరోయిన్ శ్రీదేవి, కమల్హాసన్ ప్రేమలో పడింది తొలిదశలో. పెద్దల అభ్యంతరంతో వారి ప్రేమ పెళ్ళివరకు రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్లో హీరోయిన్గా చేస్తూ వివాహితుడైన బోనీకపూర్తో పెరిగిన పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. వీరిద్దరూ అన్యోన్యంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఆమె రీ ఎంట్రీ విషయంలో కూడా నిర్మాత బోనీకపూర్ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
నటి రమ్యకృష్ణ, దర్శకుడు కృష్ణవంశీలది కూడా ప్రేమ వివాహమే. షూటింగ్లో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. పెళ్ళి తర్వాత కూడా రమ్యకృష్ణ నటిగా కొనసాగుతున్నారు.
నటుడు శ్రీకాంత్, నటి ఊహ కూడా ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఫిలిం కెరీర్లోనే వీరి ప్రేమపుట్టింది. వివాహం తర్వాత ఊహ గృహజీవితానికే పరిమితమయింది.
మలయాళ చిత్రాల్లో కావేరిగా రంగ ప్రవేశం చేసి, తెలుగులో 'శేషు' చిత్రంతో పరిచయమైన కళ్యాణి 'పెదబాబు' షూటింగ్ సమయంలో దర్శకుడు సూర్యకిరణ్తో ప్రేమలో’పడింది. ఇద్దరి ప్రేమ పెద్దల అంగీకారంతో ఫలించి పెళ్ళికి దారితీసింది. ఈమె నిర్మాతగా, భర్త దర్శకుడుగా 'చాప్టర్-6' చిత్రం కూడా ఇటీవల రూపొందించారు.
నటుడుగా పుంజుకుంటున్న సమయంలో శ్రీహరి, నటి డిస్కోశాంతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్ళి తర్వాత డిస్కోశాంతి సినిమాలకు స్వస్తి చెప్పింది. వీరి దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది.
తుళు కుటుంబంలో జన్మించిన నటుడు ప్రకాశ్రాజ్ తొలుత డిస్కోశాంతి సోదరి లలితకుమారిని వివాహం చేసుకున్నారు ప్రేమించి. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి పుట్టారు. అబ్బాయి మరణించాడు. ఆ తర్వాత లలిత కుమారితో విడిపోయి గతసంవత్సరం కొరియోగ్రాఫర్ పోనీవర్మని వివాహం చేసుకున్నారు.
నటి రాధిక తొలుత నటుడు ప్రతాప్పోతన్ని ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. ఆ దాంపత్యం కొంతకాలమే కొనసాగింది. ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రానికి నేషనల్ అవార్డ్ కూడా లభించింది. ఆ తర్వాత ఓ బ్రిటిషర్తో పరిచయం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి అది పెళ్ళకి దారితీసింది. కొన్నాళ్లు ఆ దాంపత్యం కొనసాగాక విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తమిళహీరో శరత్కుమార్ రాధికని ప్రేమించారు. పెళ్ళి మాట తెస్తే తొలుత రాధిక అంగీకరించలేదు. హీరోని పెళ్ళాడటం ఇష్టంలేదని ఖచ్చితంగా చెప్పారు. కానీ తల్లి ఒత్తిడి, శరత్ కుమార్ ప్రపోజల్తో ఇరువురూ దంపతులై దాంపత్య జీవితం హ్యాపీగా కొనసాగిస్తున్నారు.
కమల్హాసన్, శ్రీదేవి ప్రేమించుకున్నారు కానీ ఇరువర్గాల పెద్దలు అంగీకరించక పోవడంతో ప్రేమబంధమే కొన్నాళ్ళు సాగింది. ఆ తర్వాత వాణీ గణపతిని ప్రేమించి వివాహమాడారు. కొంతకాలం తర్వాత విడిపోయారు. ఆ తర్వాత హీరోయిన్ సారిక పరిచయంతో ఇద్దరిమధ్య ప్రేమ పుట్టి వివాహబంధం అయింది. ఇద్దరు పిల్లలు పుట్టాక మనస్పర్థలు పెరిగి విడాకులకు దారితీసింది. ఇప్పుడు నటి గౌతమితో సహజీవనం కొనసాగిస్తున్నారు.
నటి రమాప్రభ (అప్పటికే వివాహిత), నటుడు శరత్బాబుని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరి వివాహబంధం కొంతకాలం బాగానే కొనసాగింది. ఇరువురూ ఫిలిం కెరీర్లోనే కొనసాగుతుండగా కొన్ని అనివార్య కారణాలతో విడిపోయారు. ఆ తర్వాత శరత్బాబు తమిళ విలన్, కేరక్టర్ నటుడు నంబియార్ కుమార్తెను పెళ్ళాడి దాంపత్యజీవితం హ్యాపీగా కొనసాగిస్తున్నారు.
పాటల రచయిత చంద్రబోస్, కొరియోగ్రాఫర్ సుచిత్రలది ప్రేమ వివాహమే. సుచిత్రా చంద్రబోస్ ఆ మధ్య 'పల్లకీలో పెళ్ళికూతురు' చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు.
హ్యాపీడేస్ ఫేమ్ వంశీ కాలేజీరోజుల్లోనే ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో ఆ ప్రేమ పెళ్ళిబంధంగా మారింది.
ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సావిత్రిలది ప్రేమ వివాహమే. బాలు పాటలకు తొలుత అభిమాని సావిత్రి. ఆ తరువాత వారి పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది.
నాగార్జునది తొలుత పెద్దలు కుదిర్చిన పెళ్ళి. నిర్మాత డి.రామానాయుడు కుమార్తె లక్ష్మితో వివాహం అయింది. వీరి పుత్రుడే నాగచైతన్య. ఆ తరువాత దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తి విడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఫిలిం కెరీర్లో ఏర్పడ్డ పరిచయాలతో అమలకి తన ప్రేమ ప్రపోజ్ చేసారు. కొంతకాలం అమల నుంచి సమాధానం రాలేదు. ఆ తర్వాత హీరోయిన్ అమల, నాగార్జునల మధ్య చిగురించిన ప్రేమ పెళ్ళికి దారితీసింది. పెళ్ళి తర్వాత అమల గృహజీవితానికి అలవాటుపడి, తరువాత మూగజీవుల సంరక్షణను కొనసాగిస్తోంది. వీరి పుత్రుడే అఖిల్.
మహేష్, నమ్రతా శిరోద్కర్లది ప్రేమ వివాహామే. తొలి చూపులోనే ప్రేమ అంటే నచ్చని తత్వం గల మహేష్ పరిచయం తర్వాత స్నేహంగా మారాక, అది ప్రేమకు దారితీసాక తలిదండ్రులు అనుమతితో వివాహబంధంగా మార్చుకున్నారు.
ప్రముఖ గాయని పి. సుశీల, డా. మోహన్రావులది ప్రేమ వివాహమే. ఆనందంగానే చివరివరకు కొనసాగింది. ప్రముఖ గాయని ఎస్.జానకి రాంప్రసాద్లది కూడా ప్రేమ వివాహమే. వీరిదీ అన్యోన్య దాంపత్యమే.
గాయకుడు రామకృష్ణ, గాయని జ్యోతి ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. గాయనీ గాయకులు గోపికా పూర్ణిమ మల్లికార్జున్లది కూడా ప్రేమ వివాహమే.
హఠాత్తుగా అనారోగ్యం సంప్రాప్తించిన హీరోయిన్ వాణిశ్రీకి వైద్య చికిత్స చేసిన డా. కరుణాకర్ మెల్లిగా ఆమెను ప్రేమించసాగారు. అక్క, బావలతో ఉంటూన్న వాణిశ్రీకి ఒక అండకూడా అవసరమైన కారణంగా కరుణాకర్ ప్రేమను అంగీకరించడంతో వివాహమైంది. వీరిదీ అన్యోన్య దాంపత్యమే.
నటి రోహిణి, నటుడు రఘువరన్లది, నటుడు మహర్షి రాఘవ నటి మహాలక్ష్మి (పుష్పత-ఏవిఎమ్ రాజన్ల కుమార్తె) లది కూడా ప్రేమ వివాహమే. అయితే ఈ దంపతుల వైవాహిక జీవితం కొన్నేళ్లే బాగా కొనసాగింది.
నటి విజయశాంతి, తర్వాత నిర్మాత అయిన శ్రీనివాస్ ప్రసాద్లదీ ప్రేమ జీవనమే. దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్, నటి అనితలది ప్రేమైక సహజీవనమే.
సీతారత్నంగారి అబ్బాయి, ముగ్గురు మొనగాళ్ళు, భైరవద్వీపం, చిత్రాల హీరోయిన్గా రాణించి తర్వాత కేరక్టర్ ఆర్టిస్టుగా మారిన రోజా పలు తమిళ చిత్రాల్లో నటించింది. తమిళ దర్శకుడు సెల్వమణి చిత్రాల్లో నటిస్తుండగా ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమ పెళ్ళికి దారితీసి ఆనందమయ జీవనం గడుపుతున్నారు.
హీరో సూర్య, హీరోయిన్ జ్యోతికల ప్రేమ వివాహం అన్యోన్యంగా సాగుతోంది.
బాలనటిగా ప్రవేశించి హీరోయిన్గా ఎదిగిన రాశి దర్శకుడు నివాస్లది కూడా ప్రేమ వివాహమే.
సహాయ పాత్రలు పోషిస్తూ, అందమైన కేరక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న సుమిత్ర, కన్నడ దర్శకుడు రాజేంద్రబాబు కూడా ప్రేమించి పెళ్ళాడారు.
పవన్ కళ్యాణ్కి నందితకు వివాహం అయింది. తర్వాత సమస్యగామారి విశాఖపట్టణం కోర్టులో చాలాకాలం సాగి విడాకుల వరకు దారితీసింది. తర్వాత రాజీపడ్డారు. నటి రేణుకాదేశాయ్తో చాలాకాలం సహజీవనం సాగించాక మూడు ముళ్లు వేసారు పవన్కళ్యాణ్.
తలంబ్రాలు చిత్రంలో హీరోయిన్గా తెలుగుతెరకు పరిచయమైన జీవిత, ఆ చిత్రంలో నటించిన డా. రాజశేఖర్ కొన్ని చిత్రాల్లో జంటగా నటించారు. వారి మధ్య చివురించిన ప్రేమ 'మగాడు' చిత్రంలో రాజశేఖర్కి యాక్సిడెంట్ కావడంతో మరింత బలపడి పెద్దల ఆశీర్వాదంతో పెళ్ళాడారు. ఈ దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది.
హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ, రంగస్థలంలోనూ బిజీగావున్న దాసరినారాయణరావు తన చెల్లెలుకి గాజులు కొనడానికి సుల్తాన్ బజార్ వెడితే, అక్కడ చెల్లెలు చేతికి సరిపోయే గాజులను ఎంపిక చేసిన పద్మతో ఏర్పడిన పరచయం ప్రేమగా మొలకెత్తి పెళ్ళిపీటలు ఎక్కించింది. తర్వాత సినీరంగంలో బిజీ అయ్యారు దాసరి నారాయణరావు. ట్రేడ్ యూనియనిస్ట్గా, రాజకీయ వేత్తగా, నిర్మాతగా దాసరి పద్మ కొనసాగుతూ అన్యోన్యదాంపత్య జీవితం కొనసాగిస్తున్నారు.
దాసరి గురించి రాసాక దాసరిని దర్శకుడిని చేసిన నిర్మాత (ప్రతాప్ ఆర్ట్స్ కె.రాఘవ) ద్వారానే దర్శకుడైన ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ గురించి ప్రస్తావించకపోతే ఎలా? దర్శకుడుగా ఎదుగుతున్న కోడిరామకృష్ణకు తెనాలికి చెందిన సినీరంగంలో నటిగా కొనసాగే ప్రయత్నం చేస్తున్న పద్మాంజలితో ఏర్పడ్డ పరిచయం ప్రేమకు దారి తీసి మూడు ముళ్ళు వేయించింది. పెళ్ళి తర్వాత నటజీవితానికి స్వస్తి పలికి గృహిణిగానే కొనసాగుతోంది ఆయన భార్య.
ప్రేమలు, పెళ్ళిళ్ళు గురించి నటి జమున అభిప్రాయం ఒకసారి పరిశీలిద్దాం. తిరుపతిలో రీసెర్చి చేస్తున్న జువాలజీ ప్రొఫెసర్ రమణరావుతో ఆమె వివాహం కుదిరాక, తోటి హీరోయిన్లతో చర్చ వచ్చిందట. సినీపరిశ్రమతో సంబంధంలేని బయట వ్యక్తిని పెళ్ళాడుతున్నావు. ఇది రిస్క్ అని, అపోహలు, అనర్థాలు పెరుగుతాయి అని, ఇప్పటివరకు హీరోయిన్లెవరూ బయటవారిని పెళ్ళాడలేదని అన్నారట. అంతా మన ప్రవర్తనమీదనే ఆధారపడివుంటుందని జమున ఆ ప్రసక్తిని ఖండించింది. ''పరిశ్రమలోని వ్యక్తినో, తోటి హీరోనో, నటుడినో, నటినో పెళ్ళి చేసుకున్న వారిలో ఎంతమంది సుఖసంసారం సాగించారు? అంతా సంస్కారం మీదనే ఆధార పడివుంటుం''దని కూడా వారితో జమున అన్నారు. అంతేకాదు సినీతారలను బయటవారు పెళ్ళి చేసుకోరనే ఒక అపనమ్మకం ప్రబలింది. అందుకే సినిమారంగంలో వారినే ఒక్కోసారి వివాహితుడైనా సినిమావారు చేసుకుంటున్నారు- అని కూడా అన్న జమున తన మాటమీదనే నిలబడి వివాహబంధం చక్కగా కొనసాగిస్తోంది. ఇలా బయట వ్యక్తులను పెళ్ళి చసుకున్నవారిలో బి.సరోజాదేవి, ఎల్.విజయలక్ష్మి, కృష్ణకుమారి ప్రభృతుల వివాహజీవితం ఆనందమయంగానే సాగింది, సాగుతోంది.
ప్రేమ ఎంతో మధురం అది ఫలించే వరకూ. ఫలించి పెళ్ళికి దారితీసాక కొన్ని నెలలకు, కొన్నేళ్ళకు కొందరికి కాలకూటవిషం. కారణం ప్రేమ పొరల్లో చిక్కుకున్నందున భావాలు, ఆలోచనలూ, కోరికలు, ఒకే రకం అని అప్పుడు ఎంత పోలికలతో అనిపించినా ప్రేమామృతం పలుచన అయ్యాక ఒకరి అలవాట్లు, ఆలోచనలు, ఆశలు, కోరికలు విరుద్ధంగా కనిపిస్తాయి. ముఖ్యంగా కులాంతర, మతాంతర, భాషాంతర ప్రేమికుల్లో కాంప్లెక్స్లు బయటపడతాయి. అవి చిలికి చిలికి గాలివానలా మారతాయి. ప్రేమే జీవితం, ప్రేమే సర్వస్వం అంటూ ప్రేమకోసం ఎన్నోసార్లు పాడిన హీరో, హీరోయిన్ల మధ్యగాని, తన ప్రేమను దక్కించుకోడానికి హీరోయిన్, హీరోని అగచాట్ల పాలుచేసిన విలన్లు, వ్యాంపుల విషయంలోనైనా పురుషుడిలోని అహంకారం పరాకాష్ఠకు చేరితే, స్త్రీలోని ఓరిమి సన్నగిల్లుతుంది. సినిమావారి ప్రేమ అయినా, ఇతర రంగాల్లోని వారి ప్రేమ అయినా ఇంతే. అందరాని అందం, అందుకోలేని సుందరి అందాక కొన్నాళ్ళకు మొహం మొత్తుతుంది. పరస్త్రీలపై వ్యామోహం పెరుగుతుంది ('తేనెటీగ' ఇతివృత్తం ఇదే). దీనికి కారణం కొంత భార్య వ్యవహార శైలియే. తొలిరోజుల్లో ఎంతో విరహాత్కంఠితలా ఎదురుచూచే భార్య, కుటుంబ బాధ్యతలు, వంట-వార్పులు వల్ల ఇంట్లోంచి బయట కెళ్ళడంలేదు కదా అని, ఇంకా నాలో ఏం ప్రత్యేకత- వుంది అనే భావనలో సింగారానికి దూరం అవుతారు. తద్వారా భర్త ఈసడింపులు ఎక్కువవుతాయి. భర్తకూడా అలాగే వ్యవహరిస్తాడు. ప్రేమ వికటిస్తుంది.
ఒకే కెరీర్లో వున్నా పెళ్ళి తర్వాత భార్య అందలం ఎక్కితే భర్త సహించలేడు. భార్యలోని ప్రతి అంశమూ తప్పుగానే, తనను అవమానిస్తున్నట్టుగానే తోస్తుంది. ఈ అంశాన్ని అమితాబ్, జయబాధురి సినీరంగానికి చెందిన పాత్రలు పోషించిన 'అభిమాన్' చిత్రంలో చక్కగా చూపారు.
సినీరంగానికి చెందిన పాత్రలు కాకపోయినా భానుమతి ఎన్టీఆర్ నటించిన 'వివాహబంధం'లోనూ చూపారు.
దాసరి దర్శకత్వంలో శోభన్బాబు, శారద నటించిన 'బలిపీఠం' కూడా ఒక ఉదాహరణ.
ప్రేమే సర్వస్వం అన్నవారికి ప్రేమ తిండిపెట్టదు- అనే విషయం కొంతకాలం తర్వాత అనుభవపూర్వకంగా తెలుస్తుంది. జగదేకవీరుడు సగటు మానవుడు, అతిలోక సుందరి సాధారణ స్త్రీ అయి పోతారు. ప్రేమ పైత్యం అనిపిస్తుంది. పెళ్ళి పీడగా కనిపిస్తుంది. సర్దుకుపోయే మనస్తత్వం, ఓరిమి, సహనం, పట్టు విడుపులు లేకపోవడం వల్లే పలు ప్రేమ పెళ్ళిళ్ళు విడాకులకు దారితీస్తున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment