Tuesday, December 6, 2011

చలనచిత్ర రంగంలో చేజారిపోతున్న ప్రముఖ స్థానం

భారతదేశంలో తెరపై బొమ్మలు మాట్లాడడం మొదలై, 80 ఏళ్ళు పూర్తయ్యాయని 'అశీతి' (అంటే సంస్కృతంలో ఎనభై అని అర్థం) పూర్తి ఉత్సవాలు జరుపుకొంటున్నాం. తెలుగు మాటలు, పాటలే ఉన్న తొలి తెలుగు సంపూర్ణ టాకీ 'భక్త ప్రహ్లాద' అసలు సిసలు విడుదల తేదీ ఏమిటన్న దానిపై ఇటీవల ఓ పరిశోధనలో సరికొత్త సాక్ష్యాధారాలు వెలుగు చూశాయి. అయినా, వాటిని పట్టించుకోకుండా పాత నమ్మకమైన సెప్టెంబర్‌ 15నే పట్టుకొని వేలాడుతూ, ఆ రోజే చిత్ర పరిశ్రమ పెద్దలు 'తెలుగు చలనచిత్ర దినోత్సవం' జరిపారు. ఏటేటా, ఆ రోజునే జరుపుతామనీ ప్రకటించారు. పండుగ జరుపుకొనే మాట ఎలా ఉన్నా, సరిగ్గా ప్రస్తుత పరిస్థితిలో తెలుగు సినిమా ఏ పరిస్థితుల్లో ఉందని చూస్తే మాత్రం ఒకింత విచారమే కలుగుతుంది. తగ్గిపోతున్న విజయాలు, దేశ చలనచిత్ర రంగంలో మన చేజారిపోతున్న ప్రముఖ స్థానం ఆందోళన కలిగిస్తాయి.


అవును! తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇటీవల కొద్దికాలంగా సర్రున కిందకు జారిపోతోంది. ఒకప్పుడు దేశం మొత్తంలో అత్యధిక చలనచిత్రాలను నిర్మించి, అగ్ర స్థానంలో నిలిచిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇవాళ ఆ స్థానాన్నీ, స్థాయినీ పోగొట్టుకుంది. ఇది ఎవరో అంటున్న నోటి మాట కాదు. గణాంకాలు, బాక్సాఫీస్‌ వివరాలు చెబుతున్న చేదు నిజం. అందుకు తాజా నివేదికలే సాక్ష్యం. సినిమాల్లో నాణ్యత, వసూళ్ళతో సంబంధం లేకుండా, నిర్మాణమైన చలనచిత్రాల సంఖ్యలో మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమ నిన్న మొన్నటి వరకు అగ్రేసర స్థానంలో నిలిచింది. హిందీ చలనచిత్ర పరిశ్రమ కన్నా మిన్నగా, దేశంలోనే అతి ఎక్కువ సంఖ్యలో సినిమాలు నిర్మించే పరిశ్రమగా మనం ముందుండేవారం. అలాంటిది 2009లో మనం చిత్ర నిర్మాణంలో ప్రథమ స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయాం. ఇటీవల విడుదలైన గణాంక వివరాలను బట్టి చూస్తే, మనం ఇప్పుడు అక్కడ నుంచి మరో మెట్టు కిందకు జారాం. నిర్మాణమైన చిత్రాల సంఖ్య రీత్యా 2010లో మనం ఏకంగా మూడో స్థానానికి పడిపోయాం.


దేశవ్యాప్తంగా తగ్గిన చిత్ర నిర్మాణం


చిత్ర నిర్మాణ సంఖ్యలో తమిళ తంబీలు మనల్ని దాటి ముందుకు వచ్చారు. తమిళ చిత్ర పరిశ్రమ రెండో స్థానానికి ఎగబాకగా, తెలుగు చిత్ర పరిశ్రమ మూడో స్థానానికి దిగజారింది. కేంద్ర సెన్సార్‌ బోర్డు ('సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌' - సి.బి.ఎఫ్‌.సి) 2010వ సంవత్సరానికి గాను జారీ చేసిన వార్షిక నివేదికలో ఈ సంగతులు వెల్లడయ్యాయి. మన దేశం మొత్తం మీద నిర్మాణమైన చలనచిత్రాల సంఖ్య గత ఏడాది కొద్దిగా తగ్గింది. 2009లో మన దేశం మొత్తం మీద, వివిధ భాషలన్నీ కలిపి 1288 చిత్రాలు తయారయ్యాయి. కాగా, ఆ మరుసటి ఏడాది 2010 కల్లా ఆ సంఖ్య కొద్దిగా తగ్గి, 1274కు చేరిందని సెన్సార్‌ బోర్డు వార్షిక నివేదిక తెలిపింది.


తమిళం ముందు! తెలుగు వెనుక!!


మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే, పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. తెలుగులో రూపొందుతున్న చిత్రాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2009లో తెలుగులో నిర్మాణమై, సెన్సార్‌ జరుపుకొని, సర్టిఫికెట్‌ పొందిన చిత్రాల సంఖ్య (నేరు తెలుగు చిత్రాలు, అనువాద చిత్రాలు కలిపి) 218. కాగా, గత ఏడాది - అంటే 2010లో ఇది 181కి పడిపోయింది. ఫలితంగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ దేశం మొత్తం మీద ఏకంగా మూడో స్థానంలోకి పడిపోయింది. పొరుగు రాష్ట్రంలోని తమిళ సోదరులు చిత్ర నిర్మాణ సంఖ్యలో మనల్ని దాటి, ముందుకు వచ్చారు. ''తమిళంలో గడచిన 2010లో 129 నేరు చిత్రాలు వచ్చాయి. అనువాద చిత్రాలు కలపకుండానే ఇన్ని చిత్రాలు నిర్మాణం కావడానికి తమిళ చిత్ర పరిశ్రమలో ఓ రికార్డు'' అని తమిళ చలనచిత్ర చరిత్రకారుడు, జర్నలిస్టు అయిన ఎనిమిది పదుల 'ఫిల్మ్‌న్యూస్‌' ఆనందన్‌ వివరించారు. ఈ ''2011లో ఆగస్టు చివరి నాటికే తమిళంలో 80 నేరు చిత్రాలు వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 140 చిత్రాలు వస్తాయని అంచనా'' అని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 7 ఒక్క రోజునే తమిళంలో ఏడు చిత్రాలు రిలీజవడం అందుకు పెద్ద సూచన.


వెలుగు తగ్గడానికి కారణాలెన్నో!


'అరయంగ కర్ణుడీల్గె నార్గురి చేతన్‌...' అంటు కర్ణుడి చావుకు కారణాల లాగా, తెలుగులో చలనచిత్ర నిర్మాణం తగ్గడానికి కూడా అనేక కారణాలున్నాయి. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మారిపోతున్న రాజకీయ పరిస్థితులు, కొరవడిన ప్రశాంతత, గత రెండేళ్ళుగా తెలుగులో బాక్సాఫీస్‌ హిట్లు గణనీయంగా తగ్గిపోవడం లాంటివి అందులో కొన్ని కారణాలు. అలాగే, అదుపు లేకుండా పెరిగిపోతున్న నిర్మాణ వ్యయంతో సహా అనేకానేక అంతర్గత సమస్యలు సైతం తెలుగు చలనచిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే, ఇది ఆందోళనకరమైన పరిణామమే! తెలుగు పరిశ్రమకు ఇది మంచి ధోరణి కాదనేది అందరూ ఒప్పుకొనే విషయం. నిజం చెప్పాలంటే, ఇవాళ తెలుగు చిత్ర సీమలో రెగ్యులర్‌గా సినిమాలు తీస్తున్న నిర్మాతలు కూడా చాలా తక్కువే! సినిమాయే లోకంగా బతుకుతూ, అంకితభావంతో ఒకదాని తరువాత మరొకటిగా సినిమాలు తీస్తున్న చిత్రనిర్మాతలు ఇవాళ ఆట్టే లేరు. ''సినీ వ్యాపారమే తప్ప, మరో వ్యాపారం తెలియని నిర్మాతలు ఇవాళ పరిశ్రమలో నూటికి 10 మంది మించి లేరు. నిర్మాతల మండలిలో 928 మంది నిర్మాతలున్నారు. కానీ, వారిలో ఎక్కువ మంది ఒకటి రెండు సినిమాలు నిర్మించి, ఆగిపోయినవాళ్ళే! అయిదు, అంతకన్నా ఎక్కువ సినిమాలు తీసినవాళ్ళ సంఖ్య తక్కువ'' అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి ఇటీవలే అధ్యక్షుడైన నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ సైతం పేర్కొన్నారు.


కళ్ళు తెరవాల్సిన తరుణం


ఏతావాతా, కొన్నేళ్ళుగా ఏటా అత్యధిక చిత్రాలు నిర్మిస్తున్న ఘనత వహించిన మన తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడిలా ఇలాంటి అనేకానేక కారణాల వల్ల ఆ ప్రత్యేకతను కోల్పోవడం విచారకరమే. సినిమాల కథ కథనాల్లో, నాణ్యతలో, జాతీయ స్థాయి గుర్తింపు, అవార్డుల విషయంలో ఇప్పటికే మనం వెనుకబడి ఉన్నామన్నది సినీ ప్రియులం జీర్ణించుకోలేకపోతున్న వాస్తవం. గోరుచుట్టు మీద రోకటి పోటులా ఇప్పుడు చిత్ర నిర్మాణ సంఖ్యలోనూ వెనుకబడ్డాం. ఇప్పటికైనా మన నిర్మాతలు, దర్శకులు, హీరోలు, సాంకేతిక నిపుణులు కళ్ళు తెరవాలి. వాస్తవ పరిస్థితుల్ని గుర్తించాలి. చిత్ర నిర్మాణం ఎందుకు తగ్గిపోతోందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. చిత్ర నిర్మాణం తగ్గిపోవడానికి కారణమవుతున్న తమ లోటుపాట్లనూ, కొండకచో వ్యవహార శైలినీ సరిదిద్దుకోవాలి. అప్పుడే మనం మళ్ళీ పూర్వ ప్రతిష్ఠను సంపాదించుకోగలుగుతాం. సినీ వ్యాపార ధోరణుల విశ్లేషణలో అపార అనుభవం ఉన్న కాట్రగడ్డ నరసయ్య కథనం ప్రకారం ''ఈ ఏడాదిలో ఆగస్టు నెలాఖరుకు తెలుగులో 81 నేరు చిత్రాలు, 89 అనువాద చిత్రాలు విడుదలయ్యాయి.'' దాన్నిబట్టి చూస్తే, గత ఏడాది కన్నా ఈసారి తెలుగులో చలనచిత్ర నిర్మాణాల సంఖ్య మెరుగు కావచ్చని ఓ చిరు ఆశాదీపం మిణుకు మిణుకుమంటోంది.

నాయికల జీవిత చిత్ర మాలిక

ఆదివారం అనుబంధం - Sat, 1 Oct 2011.
.సిల్క్‌ స్మిత జీవితకథ ఆధారంగా తీస్తున్న 'డర్టీ పిక్చర్‌' ఇప్పుడు సినిమా రంగంలో చర్చనీయంగా వుంది. దక్షిణాది చిత్రాలలో పచ్చి శృంగార నృత్యాలకు మారు పేరుగా ఉపయోగపడిన సిల్క్‌ స్మిత ఎంత గడించిందో గాని ఆఖరుకు అర్థంతరంగా ఆత్మహత్య చేసుకుని కనుమరుగైపోయింది. ఆవిధంగా విషాదాంతమైన నాయికల జాబితాకు అంతేలేదు. మీనా కుమారి, సావిత్రి, శోభ, ఫటాఫట్‌ జయలక్ష్మి, విజయశ్రీ.... ఇలా ఎందరినైనా చెప్పొచ్చు. హాలివుడ్‌లోనైతే మర్లిన్‌ మన్రో మరణం ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంత దారుణంగా గాకున్నా వ్యాధిగ్రస్తులై మరణించిన మహిళా తారల విషయంలోనూ బోలెడు మానసిక ఘర్షణ, మానవీయ వేదన కనిపిస్తాయి. మరోవైపునుంచి చూస్తే జయప్రద, సబిత వంటి వారిని పూర్వ భర్తలు వేధించి కోర్టులకెక్కిన తీరు కూడా అందరికీ తెలుసు. సబిత కేసులోనైతే హైకోర్టు సంచలన తీర్పునే ఇచ్చింది. తారామణుల ప్రతిభకు ప్రతిబంధకాలుగా తయారైన పురుషుల మూలంగానే ఇన్ని వైపరీత్యాలు సంభవించాయి. అందుకే చిత్ర పరిశ్రమ ఎప్పటికప్పుడు కథానాయికల వాస్తవ జీవితాలను ఆధారం చేసుకుని కథలల్లుతూ వుంటుంది. ఇప్పుడు సిల్క్‌ స్మిత కథ తీస్తున్నప్పటికీ గతంలోనూ బాగా ప్రసిద్ధి పొందిన ఇలాంటి చిత్రాలున్నాయి.


మీనాకుమారి స్వంత కథ..... నాయికల నిజ జీవితాల ఆధారంగా తీసిన చిత్రాలలో ముందుగా చెప్పుకోవలసింది మీనాకుమారి పాత్రనే. హిందీ సినిమా రంగానికి మకుటం లేని మహారాణిగా (తెలుగులో సావిత్రిని మించి) వెలుగొందిన మీనా కుమారి అసలు పేరు మహజబిన్‌ బానో. తల్లిదండ్రులు కూడా సినీ రంగానికి చెందిన వారు కావడంతో ఆమెను బాలతారగా ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. అప్పట్లోనే ఆమె దర్శక రచయిత కమల్‌ ఆమ్రోహీ దృష్టిలో పడింది గాని మొదట్లో వీలు పడలేదు. తర్వాత కాలంలో ఆయన ఆమెను గుర్తించడం, అవకాశాలివ్వడం జరిగింది.1952లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మీనాకుమారి మొత్తం తొంభై చిత్రాల్లో నటించారంటే ఆమె ఖ్యాతి అర్థం చేసుకోవచ్చు.ఇంతకూ కమల్‌ను పెళ్లి చేసుకున్నాక ఆమె అత్తగారి వూరు ఆమ్రోహీ వెళ్లింది. తమ ప్రేమ కథనే ఇతివృత్తంగా తీసుకుని 'దయారీ' చిత్రాన్ని పెళ్లయిన మరుసటి ఏడాదిలోనే నిర్మించింది. మరో మూడేళ్ల తర్వాత 'పాకిజా' అన్న చిత్రాన్ని మొదలెట్టారు గాని పూర్తి కావడానికి పదహారేళ్లు పట్టింది. కొన్నేళ్లు దాంపత్య జీవితం గడిపాక వారు విడిపోయారు. ఆమె సూపర్‌ స్టార్‌ కావడంతో కొందరు కుట్ర పన్ని దూరం చేశారని ఆమ్రోహీ అంటుండేవారు. విడిపోయిన కారణంగా 'పాకిజా' చిత్రం కూడా ఆగిపోయింది. ఈ లోపల జీవిత సమస్యలు తట్టుకోలేని మీనాకుమారి మద్యపానానికి బానిసవడం, ఆరోగ్యం బొత్తిగా క్షీణించి విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకోవడం జరిగాయి. మళ్లీ 1971-72 మధ్య ఆమెనే చొరవ తీసుకుని కమల్‌ ఆమ్రోహీతో మాట్లాడి 'పాకిజా'ను పూర్తి చేశారు.



దేశంలో నిర్మాణమైన సంగీత కళాభరిత చిత్రంగా 'పాకిజా' పేరొందింది. అది ఘన విజయం సాధించిన తర్వాత 'పాకిజా2' తీయాలని కూడా మీనాకుమారి ప్రతిపాదించినప్పటికీ ఆరోగ్యం సహకరించలేదు చివరకు ఆమె 1972 మార్చి 31న విషాదకరంగా మరణించింది. కాకపోతే తన ప్రేమ కథను తానే నిర్మించుకున్న నాయికగా మిగిలిపోయింది.


స్మితాపాటిల్‌...శ్యామ్‌ భూమిక


తారామణుల జీవితాల ఆధారంగా నిర్మితమైన చిత్రాల్లో బాగా ఆదరణ పొందింది శ్యాం బెనగల్‌ తీసిన 'భూమిక'. మరాఠీ నాటక సినీ నటి హంసా వాడ్కర్‌ జీవితకథ ఈ చిత్రానికి ఆధారం. భూమిక అంటేనే పాత్ర. హంసా వాడ్కర్‌ వివాదాస్పద సంచలన జీవితం గడిపింది.మామూలు మహిళలు పాటించే హద్దులు దాటి తన స్థానం నిలబెట్టుకోవడానికి పెనుగులాడింది.ఈ కథనే శ్యాం బెనగల్‌ ఎంచుకున్నారు. నాయికగా నటించిన స్మితా పాటిల్‌ అద్భుత నటన ఆ పాత్రకు ప్రాణం పోసి పురస్కారాల వర్షం కురిపించింది. బాలివుడ్‌ నటి ఉష(స్మిత) ఒక సంప్రదాయ గాయని కుమార్తె. ఆ గాయని వ్యసనపరుడు, దుర్మార్గుడు అయిన ఒక సనాతన బ్రాహ్మణున్ని పెళ్లాడి అనేక కష్టాలనెదుర్కొంటుంది. అతను చనిపోయాక తల్లి వద్దంటున్నా ఉషను సినిమాల్లో వేషాల కోసం ముంబాయి తీసుకుపోతాడు వాళ్లను కనిపెట్టుకుని వుంటున్న నౌకరు కేశవ్‌ దాల్వి (అమల్‌ పలేకర్‌). అమ్మమ్మ ఆనందం, అమ్మ ఆవేదనల మధ్య ఉష నటిగా మారుతుంది. చిన్నప్పటి నుంచి తనపై కన్నేసిన కేశవ్‌నే పెళ్లి చేసుకుంటుంది. కొంత అనివార్యంగా కొంత అభిమానంగా. ఈ పెళ్లి తల్లికి ఇష్టం లేకున్నా ఉష ఎదిరించి చేసుకుంటుంది. అయితే అతను భర్తగా గాక నౌకరుగానే వ్యవహరిస్తూ తన వల్ల ఆర్థిక లాభమే ఆశిస్తున్నాడని అనతికాలంలోనే అర్థం చేసుకుంటుంది. కేశవ్‌ అనేక వ్యాపారాలు చేసి విఫలమై చివరకు ఆమెకు తార్పుడుగాడుగా తయారవుతాడు. హీరో రంజన్‌ (అనంత నాగ్‌)కు ఆమెను దగ్గర చేయాలని ప్రయత్నించి మళ్లీ తనే అసూయకు గురవుతాడు. ఈ ఘర్షణ భరించలేని ఉష ఏదో లోకంలో వున్నట్టుండే స్వార్థపర దర్శకుడు సునీల్‌ వర్మ (నసీరుద్దీన్‌ షా)కు కాస్త దగ్గరవుతుంది గాని ఆమె ఘర్షణ తగ్గదు. తర్వాత వినాయక్‌ కాలే (అమ్రిష్‌ పురి) అనే కోటీశ్వరుడికి అనధికార ద్వితీయ కళత్రమై కొంత గౌరవం పొందాననుకుంటుంది. కాని ఆ ఇంట్లో తనకు స్వేచ్ఛా స్వంతత్రాలు బొత్తిగా లేవని, కాలే వన్నీ బూటకపు మర్యాదలనీ తెలిసి మళ్లీ గతిలేక కేశవ్‌ ద్వారానే అక్కడి నుంచి బయటపడుతుంది. ''పడక మారుతుంది, వంటిల్లు మారుతుంది. మగాళ్ల ముసుగులు మారతాయి. కాని మగాళ్లు మాత్రం మారరు.'' అని కేశవ్‌ భార్య అంటుండగా మళ్లీ పాత జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ చిత్రం 1978లో స్మితా పాటిల్‌కు జాతీయ ఉత్తమ నటి అవార్డు తెచ్చిపెట్టడమే గాక శ్యాం బెనగళ్‌ గిరీష్‌ కర్నాడ్‌, సత్యదేవ్‌ దూబేలకు ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారంకూడా తెచ్చింది.


సిల్క్‌ స్మిత జీవితమే 'డర్టీ పిక్చర్‌'


ఇప్పుడు ఏక్తా కపూర్‌, మిలన్‌ లూథ్రియాలు దక్షిణాది తార సిల్క్‌ స్మిత కథపై తీస్తున్న 'డర్టీ పిక్చర్‌'లో నాయికగా విద్యా బాలన్‌ నటిస్తుంది. గతంలో పాప వంటి చిత్రాల్లో గంభీరమైన పాత్రలకు పేరొందిన విద్యాబాలన్‌ స్మితగా నప్పుతుందా ఆమె ఆకారం అలా వుంటుందా వగైరా సందేహాలు కొందరు వ్యక్తం చేసినా విద్య వాటన్నిటినీ కొట్టిపారేస్తున్నది. స్మిత అసలు పేరు విజయలక్ష్మి. నైలెక్స్‌ నళిని, పటాపట్‌ జయలక్ష్మి లాగే సిల్క్‌ స్మిత అన్నది కూడా ఆమెను పాపులర్‌ చేయడానికి తగిలించిన పేరు. నల్లగా లావుగా వుండే 'సిల్క్‌' లేని కమర్షియల్‌ చిత్రాలే ఒకప్పుడు దక్షిణాదిన వుండేవి కావు. హీరోను చూసి గాక సిల్క్‌ డాన్సు నెంబర్‌ వుందో లేదో తెలుసుకున్నాకే బయ్యర్లు కొంటారని అంటుండేవారు. ఆమె పారితోషికం కూడా చాలా భారీగా వుండేది. 'వసంత కోకిల, సీతాకోక చిలుక, బావ - బావ మరిది...' వంటి ఎన్నో చిత్రాలు ఆమె చుట్టూ తిరిగాయి కూడా. అయితే ఇంతటి ప్రసిద్ధి గల ఆమె నిజ జీవితం మాత్రం బాధామయం. చిన్న చిన్న పాత్రలు వేసే రోజుల్లో ఆమెను గుప్పిట్లో పెట్టుకున్న మూర్తి అనే ఆసామి తర్వాత కాలంలోనూ వేధిస్తూ డబ్బు గుంజుతుండేవాడు. పదేళ్ల పాటు కనకవర్షం కురిపించిన ఆ తారను అనునిత్యం వేధిస్తుండేవాడట. తట్టుకోలేక ఆమె అనేక సార్లు ఆత్మహత్యా యత్నాలు కూడా చేసింది. చివరకు విషాదకరంగా ఉరి వేసుకుని మరణించింది.


సిల్క్‌ స్మిత పాత్ర వేయడం తనకేమీ కష్టంగా లేదని విద్యాబాలన్‌ ధీమాగా చెబుతున్నది. ప్రేక్షకులకు తెలిసిందల్లా ఆమె డాన్సులు, పాటలే. ఆమె మ్యానరిజమ్స్‌ కూడా వారు పూర్తిగా గమనించి వుండరు. ఏ ఇందిరాగాంధీ పాత్రనో వేయాలంటే ఆమె గురించిన ప్రతి విషయమూ ప్రజలకు తెలిసి వుండే అవకాశం వుంది. అమితాబ్‌ బచన్‌ వేషం వేయాలన్నా అంతే కష్టం. కాని సిల్క్‌ స్మిత విషయానికి వస్తే ఆ సమస్యలేమీ వుండవు. ఆమెను గురించి నేను ఏమనుకుని ఎలా నటించాలనుకున్నానో అలాగే నటించేస్తాను అన్నారు విద్య. సిల్క్‌ జీవితాన్ని ప్రభావితం చేసిన ముగ్గురు పురుషులుగా నసీరుద్దీన్‌ షా, తుషార్‌ కపూర్‌, ఇమ్రాన్‌ హస్మీ నటిస్తున్నారు. అన్నట్టు విద్యా బాలన్‌ గతంలోనూ నిజ జీవిత పాత్ర ధరించకపోలేదు. 'నో బడీ కిల్డ్‌ జెస్సీకాలాల్‌' అన్న చిత్రంలో ఆమె అక్క షబ్రినాలాల్‌ పాత్ర పోషించింది.


నాయిక శారదనా షీలానా?


ఇప్పుడు మళయాలంలో జయరాజ్‌ రూపొందిస్తున్న 'నాయిక' చిత్రం కూడా అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం మూడు సార్లు ఊర్వశి పురస్కారం పొందిన శారద కథ అని అనుకుంటున్నారు. తెలుగు తార అయినప్పటికీ మళయాల చిత్రాల ద్వారా జాతీయ కీర్తి నార్జించిన శారద ఆ పిమ్మటే ఇంట గెలిచారు. శారద జీవితం కూడా పూలపాన్పు కాదు. మొదట్లో హాస్య పాత్రలలో కనిపించిన శారద 'తులాభారం' (తెలుగులో మనుషులు మారాలి) తర్వాతనే తారాపథం చేరుకోగలిగారు. హాస్యనటుడు చలం ను పెళ్లి చేసుకున్న శారద చాలా చేదు అనుభవాల తర్వాత విడిపోయారు. గ్లామర్‌ తార కాకున్నా 70, 80 దశకాలలో శారద ఒక ప్రత్యేక స్థానం పొందారు. క్రాంతికుమార్‌ శారద తర్వాత మహిళా ప్రధాన పాత్రల్లో శోభన్‌బాబుతో పలు చిత్రాల్లో నటించడమే గాక 'ప్రతిధ్వని' తర్వాత నాయికా ప్రధాన పాత్రలకు మారుపేరుగా వెలుగొందారు. హక్కుల కోసం పోరాడే మహిళ అంటే శారద అన్న పేరు పొందారు. అలాంటి ప్రముఖ నటి కథ అంటే అందరిలో ఆసక్తి రేకెత్తింది. అయితే అందులో నిజం లేదని శారదతో సహా సంబంధిత వ్యక్తులందరూ ఖండించారు. ఎన్టీఆర్‌తో 'భలేతమ్ముడు, నేనే మొనగాణ్ని' వంటి చిత్రాలలో నటించిన మళయాల తార షీలా కథ ఆధారంగా 'నాయిక' రూపొందుతున్నదట. పద్మప్రియ ఈ పాత్రను పోషిస్తున్నారు. శారద కూడా ఇందులో నటిస్తున్నారు. శర్వానంద్‌, జయరామ్‌, మమతా మోహన్‌దాస్‌ ఇతర పాత్రధారులు. తెలుగులో ఇలాంటి చిత్రాలు సూటిగా తీసిన ఉదాహరణలు లేవు గాని 'సీతామాలక్ష్మి', అంతకన్నా ఎక్కువగా 'శివరంజని' చిత్రాల్లో నాయికలను వెంటాడే శాడిస్టుల కథలను చూపించారు. అయితే అవి కూడా సంసార పక్షంగా తీయడమే తప్ప భూమికలో వలె ఆఫ్‌ బీట్‌ తరహాలో ప్రయత్నించే సాహసం జరగలేదు. ఇక ముందు కూడా జరక్కపోవచ్చు. ఎందుకంటే ఫార్ములా వలయాన్ని ఛేదించడానికి మన పరిశ్రమ నియమాలు బొత్తిగా అంగీకరించవు. పైగా హీరోల కథలను తీసినప్పుడు గొప్పగానే వుంటుంది. నాయికలపై కేంద్రీకరిస్తే హీరోలు బొత్తిగా ఒప్పుకోకపోవచ్చు. అదీ సంగతి. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన సిల్క్‌ స్మిత కథ ఇప్పుడు ఎలా తీస్తారో చూడాల్సిందే. కొద్ది కాలంలోనే అన్ని భాషల చిత్రాలను వూపేసిన దివ్య భా రతి కథ కూడా మర్చిపోవలసింది కాదు. ఎంతైనా ఇది పురుషాధిక్య ప్రపంచం గనకే నాయికల కథలే సినిమాలవుతుంటాయి. అందులో ఆవేదనతో పాటు ఆకర్షణా వుంటుందనే అంచనాతో.

దక్షిణాదిలో సినిమాల శ్రీకార గాధ

ఆదివారం అనుబంధం Sat, 22 Jan 2011,
అవునన్నా, కాదన్నా సినిమా ఇవాళ జన జీవితంలో ఓ ప్రధానమైన భాగం. ప్రజల కట్టూ బొట్టూ, ఆటా పాటా, మాటా - ఇలా అన్నిటినీ అనూహ్యంగా ప్రభావితం చేస్తున్న శక్తిమంతమైన మాధ్యమం. అలాంటి సినిమాలకు మన దేశంలో నూరేళ్ళకు పైగా చరిత్ర ఉంది. దాదాసాహెబ్‌ ఫాల్కే తీసిన 'రాజా హరిశ్చంద్ర' (1913)కు మునుపే కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఫాల్కే 'రాజా హరిశ్చంద్ర'ను తొలి భారతీయ చలనచిత్రంగా చరిత్రకారులు తీర్మానించారు. మరి, కేవలం మన దక్షిణాది వరకు తీసుకుంటే, ఇక్కడ తొలి చలనచిత్ర ప్రయత్నం ఎవరు, ఎప్పుడు, ఎలా చేశారు?


దక్షిణ భారతదేశంలో తొలి పూర్తి నిడివి చలనచిత్రాన్ని రూపొందించిన వ్యక్తి - ఆర్‌. నటరాజ ముదలియార్‌గా ప్రసిద్ధుడైన రంగస్వామి నటరాజ ముదలియార్‌ (1885 - 1972). నిజానికి, ఆయన సినిమాలతో అసలు సంబంధమే లేని వ్యక్తి అంటే ఆశ్చర్యం కలుగుతుంది. మద్రాసులోని ప్రసిద్ధ థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఆయన ఆటోమొబైల్‌ విడిభాగాల డీలర్‌. వెల్లూరులోని వ్యాపారస్థుల కుటుంబంలో 1885 జనవరి 26న ఆయన జన్మించారు. తండ్రి పేరు - రంగస్వామి. పెద్దమనిషిగా పేరున్న వ్యాపారి. మెట్రిక్‌ దాకా చదువుకున్న నటరాజ ముదలియార్‌ తన తండ్రి లాగే వ్యాపార రంగంలోకి దిగారు. రాజధాని అయిన మద్రాసుకు మారి, సమీప బంధువూ, ధనికుడూ అయిన ఎస్‌.ఎం. ధర్మలింగం ముదలియార్‌తో కలసి 'వాట్సన్‌ అండ్‌ కంపెనీ'ని స్థాపించారు. బ్రిటీషు సైకిళ్ళను దిగుమతి చేసుకొని అమ్మేవారు.


మోటారు వ్యాపారం నుంచి మూకీలకు!


అప్పట్లో ఒక్కో సైకిల్‌ 25 రూపాయలకు అమ్ముడయ్యేది. గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్‌ అంటే ఎంతో వింతగా చూస్తూ, 'రబ్బరు బండి' అని పిలిచేవారట! మొత్తానికి, నటరాజ ముదలియార్‌ సైకిళ్ళ వ్యాపారం బాగా వృద్ధిలోకి వచ్చింది. అలా అయిదేళ్ళు గడిచాక, 1911లో ఆ వ్యాపార భాగస్వాములు మరో అడుగు ముందుకు వేశారు. అమెరికన్‌ కార్లు, ఆటోమొబైల్‌ విడిభాగాల దిగుమతి వ్యాపారం చేసే విదేశీ సంస్థ 'రోమర్‌, డాన్‌ అండ్‌ కంపెనీ' అనే సంస్థను కొన్నారు. మోటారుకార్లను దిగుమతి చేసుకోవడం, అమ్మడం ప్రారంభించారు. అప్పట్లో మద్రాసులో 'అడిసన్‌ అండ్‌ కంపెనీ' ఒక్కటే అమెరికన్‌ కార్ల వ్యాపారం సాగించేదట! దాంతో, అమెరికన్‌ కార్లను అమ్మిన తొలి భారతీయుడయ్యారు - నటరాజ ముదలియార్‌. ఆ రోజుల్లో ఒక్కో కారు వెల 1000 రూపాయలే!



అప్పట్లో పాశ్చాత్య దేశాల మూకీ చిత్రాల ప్రదర్శనలను చూశాక, మన దేశంలోనూ చలనచిత్ర నిర్మాణాల తొలినాళ్ళ విశేషాలను తెలుసుకున్నాక నటరాజ ముదలియార్‌కు ఒక ఆలోచన వచ్చింది. మద్రాసులో సైతం ఇలాంటి సైలెంట్‌ ఫిల్ములు తీసే అవకాశం ఉందని ఆయన గ్రహించారు. చిత్ర నిర్మాణంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో లార్డ్‌ కర్జన్‌ భారతదేశానికి గవర్నర్‌ - జనరల్‌గా, వైస్రారుగా వ్యవహరిస్తుండేవారు.



ఆయన నిర్వహించే దర్బార్‌లనూ, సామాజిక కార్యకలాపాలనూ న్యూస్‌ రీలుగా బ్రిటీషు సినిమాటోగ్రాఫర్లు చిత్రీకరించేవారు. అలాంటి కెమేరామన్లలో ఒకరు - స్టీవర్ట్‌ స్మిత్‌. ఆయన పూనాలో ఓ సినిమా హాలు కూడా నడిపేవారు. ఆయనను ముదలియార్‌ సంప్రదించారు. సినిమాటోగ్రఫీలోని ప్రాథమిక అంశాలు నేర్పాల్సిందిగా అభ్యర్థించి, ఒప్పించారు. పూనాకు వెళ్ళి, స్మిత్‌ను కలుసుకున్నారు. లార్డ్‌ కర్జన్‌ 1903 నాటి దర్బార్‌కు అధికారిక సినిమాటోగ్రాఫరైన స్మిత్‌, మూవీ కెమేరాతో ఎలా చిత్రీకరణ జరపాలో కొద్ది రోజుల పాటు నటరాజ ముదలియార్‌కు నేర్పారు. సినిమా రూపకర్తగా మారాలని ఆశించిన నటరాజ ముదలియార్‌ అక్కడ కొన్ని దృశ్యాలు చిత్రీకరించారు. పూనాలోని స్మిత్‌ నివాసంలో ఓ రాత్రి వేళ విందు అనంతరం ఆ దృశ్యాలను ప్రదర్శించి చూశారు.


దక్షిణాదిలో తొలి స్టూడియో


అటుపైన నటరాజ ముదలియార్‌ మద్రాసుకు తిరిగి వచ్చేశారు. అప్పటికి తెలుగునేలలో అత్యధిక భాగం మద్రాసు రాజధానిగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండేది. మద్రాసు వచ్చిన ఆయన, తన వ్యాపార సహచరుడు ధర్మలింగం ముదలియార్‌తో కలసి మిత్రులనూ, వ్యాపార సహచరులనూ వాటాదారులుగా చేర్చుకొని, 1916లో 'ఇండియన్‌ ఫిల్మ్‌ కంపెనీ' పేరిట ఓ చలనచిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పారు. అప్పట్లో అందరూ ఇంగ్లీషు తరహా పేర్లు ఎక్కువగా పెడుతుంటే, ఆయన అందుకు భిన్నంగా భారతీయ నామం పెట్టడం గమనార్హం.



అలాగే, దక్షిణ భారతదేశంలోని తొలి స్టూడియోను సైతం మద్రాసులో నటరాజ ముదలియార్‌ బృందమే నెలకొల్పింది. మద్రాసులోని పరశువాక్కమ్‌ ప్రాంతంలో మిల్లర్స్‌ రోడ్డులో నెలకొన్న పెద్ద తోట బంగళా 'టవర్‌ హౌస్‌'లో స్టూడియో ఏర్పాటు చేసింది. (ప్రస్తుతం విద్యార్థుల హాస్టళ్ళు, హోటళ్ళు, దుకాణాలు, సినిమా హాళ్ళు, ఆసుపత్రులు, కల్యాణ మండపాలు, వాహనాల రద్దీతో ఎంతో ఇరుకుగా తయారైన ఆ రోడ్డులో 95 ఏళ్ళ క్రితం ఓ స్టూడియో ఉండేదంటే ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది). అప్పట్లో తంజావూరు జిల్లాలో ధనిక భూస్వామి కుటుంబానికి చెందిన తిరువయ్యూర్‌ మూపనార్‌ వద్ద లండన్‌ నుంచి కొని తెచ్చిన విలియమ్‌సన్‌ 35 ఎం.ఎం. సైలెంట్‌ మూవీ కెమేరా, ప్రింటర్‌ ఉండేవి. ఆయన వద్ద నుంచి వాటిని 1800 రూపాయలకు నటరాజ ముదలియార్‌ కొన్నారు.


తొలి మూకీకి తంటాలు


అయితే, ఫిల్మును కడిగి, నిర్మాణానంతర కార్యకలాపాలు జరిపే లేబొరేటరీని మాత్రం వాతావరణం చల్లగా ఉండి, అలాంటి పనులకు అనుకూలించే బెంగుళూరులో నెలకొల్పారు. ఫిల్ముల ప్రాసెసింగ్‌ పనిలో శిక్షణ పొందిన నారాయణస్వామిని ఆ లేబొరేటరీకి పెద్దగా నియమించారు. అప్పట్లో చిత్రీకరణ జరపగానే, చిత్రీకరణ ముగిసిన ఫిల్ము రోల్స్‌ను ఏ రోజుకు ఆ రోజు శరవేగంగా బెంగుళూరుకు పంపేసేవారు. ఎక్స్‌పోజ్‌ అయి, అలా వచ్చిన రీళ్ళను బెంగుళూరులో ప్రాసెసింగ్‌ చేసేవారు. నటరాజ ముదలియార్‌ వారానికి ఒకసారి బెంగుళూరుకు వెళ్ళి, పురోగతిని కనుక్కునేవారు.



ఆనాటి తమిళ నాటక రంగ పునరుజ్జీవనంలో ముఖ్యుడైన తన మిత్రుడు పమ్మల్‌ సంబంద ముదలియార్‌ను ఏ కథ తెరకెక్కించాలనే విషయంలో సలహా అడిగారు. భావోద్వేగాలు, పోరాటం, కొద్దిపాటి సెక్స్‌ అప్పీలు కూడా ఉన్న కథనే తెరకెక్కించాల్సిందని చెప్పి, ఆ మూడూ ఉన్న ద్రౌపదీ, కీచక వృత్తాంతాన్ని సినిమాగా తీయాల్సిందిగా ఆయన సలహా ఇచ్చారు. తొలి ప్రయత్నంలో అలాంటి కథను సినిమాగా తీయడం సరైనది కాదని కొందరు బంధువులు అభ్యంతరం చెప్పినప్పటికీ, నటరాజ ముదలియార్‌ పట్టుదలతో ముందుకు సాగి, 'కీచక వధమ్‌' ప్రారంభించారు. కానీ, ఆయన ప్రాథమికంగా రచయిత కాదు. దాంతో, తన సన్నిహిత మిత్రుడూ - రంగస్థల ప్రముఖుడూ అయిన సి. రంగవడివేలు అనే వకీలును ఆశ్రయించారు. సినిమాలో పాత్రలు పోషించే నటీనటులకు శిక్షణనిచ్చే బాధ్యతను కూడా నిర్వహించారు. అలా దక్షిణ భారతదేశంలో కెల్లా తొలి చలనచిత్రం 'కీచక వధమ్‌' (1916) తయారైంది.


గాంధీ కుమారుడితో టైటిల్‌ కార్డుల రచన


మహాభారతంలోని కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 35 రోజుల్లో పూర్తయింది. అప్పట్లో సినిమా షూటింగ్‌ చేయడానికి విద్యుత్‌ దీపాలు కూడా అందుబాటులో లేవు. అందుకే, బంగళాలో ఓ పందిరి లాంటిది వేయించి, దానికి పై కప్పు వేయకుండా తెల్లటి వస్త్రాన్ని కట్టారట! ఆ వస్త్రం గుండా వచ్చిన సూర్యరశ్మి కాంతిలో చిత్రీకరణ జరిపేవారట! రంగస్థల నటీనటులైన రాజా ముదలియార్‌తో కీచక పాత్ర, జీవరత్నంతో ద్రౌపది పాత్ర వేయించారు. అప్పట్లో ఈ సినిమా తీయడానికి రూ. 35 వేల దాకా ఖర్చయిందట! ఆ రోజుల్లో ఓ సినిమాకు అంత డబ్బు ఖర్చు కావడమంటే చాలా ఎక్కువ. చిత్ర నిర్మాణంలో నటరాజ ముదలియార్‌కు అప్పటికి పెద్దగా అనుభవం లేదనడానికి అంత ఖర్చు కావడమే సాక్ష్యం.



1917లో చిత్రీకరణ జరుపుకొన్న ఈ మూకీ చిత్రం 1918 జనవరిలో మద్రాసులోని 'ఎల్ఫిన్‌స్టన్‌ సినిమా' హాలు (మౌంట్‌రోడ్‌లోని ఇప్పటి కొత్త శాసనసభ ప్రాంగణం ఎదురుగా ఉండేది)లో విడుదలైనట్లూ, రెండు వారాల పాటు ఆడినట్లూ చరిత్రకారులు చెబుతున్నారు. ఆ చిత్రం కరాచీతో సహా భారతదేశ వ్యాప్తంగానే కాక, రంగూన్‌ (బర్మా), సిలోన్‌, ఫెడరేటెడ్‌ మాలే స్టేట్స్‌లో, సింగపూర్‌లో, ఇతర ఇరుగు పొరుగు దేశాల్లో సైతం విజయవంతంగా ఆడింది. అప్పట్లోనే ఆ సినిమా మొత్తం రూ. 50 వేల దాకా వసూళ్ళు చేసిందట! అంటే, రూ. 15 వేలు లాభమన్నమాట. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం కిందే లెక్క.



అప్పట్లో సినిమా మొత్తం శబ్దరహితంగా సాగేది కాబట్టి, మాటలు, పాటలు లేని ఆ మూకీ చిత్రాల్లో తెరపై జరుగుతున్నదేమిటో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉండేది. దాంతో, దృశ్యానికీ దృశ్యానికీ మధ్య 'ఇంటర్‌ - టైటిల్‌ కార్డుల'లో కథా సందర్భాన్నీ, సన్నివేశాన్నీ, కొన్ని ముఖ్యమైన సంభాషణలనూ తెరపై చూపేవారు. నటరాజ ముదలియార్‌ చిత్రాల్లోని టైటిల్‌ కార్డులు తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఉండేవి. దాంతో, ఈ మూకీ చిత్రాలను ఏ ప్రాంతంలోని, ఏ భాష ప్రజలు చూసినా కథ సులువుగా అర్థమయ్యేది.




మహాత్మా గాంధీ కుమారుడూ, తరువాతి రోజుల్లో ప్రసిద్ధ పాత్రికేయుడూ, వార్తాపత్రిక ఎడిటరూ అయిన దేవ్‌దాస్‌ గాంధీ ఈ చిత్రానికి హిందీ టైటిల్స్‌ రాశారు. ఇక, మద్రాసు నగర వైద్య ప్రముఖుల్లో ఒకరూ - నటరాజ ముదలియార్‌కు సమీప బంధువూ అయిన డాక్టర్‌ ఎం.ఆర్‌. గురుస్వామి ముదలియార్‌ తమిళంలో టైటిల్‌ కార్డులు రచించారు. ఇక, ఎడిటర్‌, సినిమాటోగ్రాఫర్‌, నిర్మాత, దర్శకుడు, స్టూడియో వ్యవహారాల పర్యవేక్షకుడు - అన్నీ నటరాజ ముదలియారే! కలకత్తాకు చెందిన మదన్‌, బొంబాయికి చెందిన అర్దేషిర్‌ ఇరానీలు ఆ రోజుల్లో భారతదేశమంతటా నటరాజ ముదలియార్‌ చిత్రాలను పంపిణీ చేసేవారు. అలా 'కీచక వధమ్‌'లో ఏ భాష మాటలూ వినిపించకపోయినప్పటికీ, దీనితో సంబంధం ఉన్నవాళ్ళందరూ ఎక్కువగా తమిళులే కావడంతో, చాలామంది దీన్ని తొలి తమిళ చిత్రంగా పేర్కొంటూ ఉంటారు. కానీ, నిర్దుష్టంగా చెప్పాలంటే - ఇది దక్షిణ భారతదేశంలో తయారైన తొలి పూర్తి నిడివి చలనచిత్రం!


ఆడవారి కోసం అష్టకష్టాలు


నటరాజ ముదలియార్‌ నేతృత్వంలోని 'ఇండియన్‌ ఫిల్మ్‌ కంపెనీ' ఆ తరువాత తమ రెండో చిత్రం 'ద్రౌపదీ వస్త్రాపహరణం' నిర్మించింది. 1917లో ఆ చిత్రం విడుదలైంది. సినిమాల్లో నటించడానికి ఆడవాళ్ళు అప్పట్లో ముందుకు వచ్చేవారు కాదు, అందులోనూ కులస్త్రీలు అసలు వచ్చేవారు కాదు. నటరాజ ముదలియార్‌కు సైతం ఈ ఇబ్బంది తప్పలేదు. అయితే, ఎలాగోలా ప్రాథేయపడి, పాశ్చాత్య మహిళలనూ, ఆ తరువాత కొంతమంది ఆంగ్లో - ఇండియన్‌ స్త్రీలనూ నటనకు ఒప్పించారు. ఆ సమస్యను ఆయన అలా పరిష్కరించారు. వయొలెట్‌ బెర్రీ అనే మహిళ ఆయన నిర్మించిన చిత్రాల్లో నటించారు.



ఆమే కాకుండా విలోచన (మేరియన్‌ హిల్‌), రాజా ముదలియార్‌, జీవరత్నం, దొరైస్వామి పిళ్ళైలు కూడా 'ద్రౌపదీ వస్త్రాపహరణం'లో నటించారు. భారతీయ వనితలెవరూ పోషించడానికి ఇష్టపడని ద్రౌపది పాత్రను పాశ్చాత్య వనిత వయొలెట్‌ బెర్రీ ధరించగా, దుశ్శాసనుడి పాత్రను ఆంగ్లం తెలిసిన దొరైస్వామి పిళ్ళై పోషించినట్లు చెబుతారు. బ్రిటీషు వారు మన భారతీయులను బానిసలుగా చూస్తున్న ఆ రోజుల్లో బ్రిటీషు వనితతో ద్రౌపది వేషం వేయించి, ఆమె చీర ఊడదీయించిన ధీశాలి నటరాజ ముదలియార్‌. మొదటి సినిమా కన్నా తక్కువ ఖర్చుతో రూపొందిన ఈ చిత్రం, దాని కన్నా ఎక్కువ వసూళ్ళు (రూ. 75 వేలు) సాధించిందట!తరువాతి కాలంలో నటరాజ ముదలియార్‌ స్వతంత్రంగా చిత్ర నిర్మాణాన్ని చేపట్టడం కోసం ఆ సంస్థను విడిచిపెట్టి వెళ్ళారు.



స్వస్థలమైన వేలూరుకు వెళ్ళి, ఒంటి చేత్తో 1919లో 'మహిరావణన్‌', 'మార్కండేయ' అనే రెండు చిత్రాలు నిర్మించారు. ఆ రెండు చిత్రాలనూ వెల్లూరు పరిసరాల్లోని కొండ ప్రాంతాల్లో చిత్రీకరించారు. 'మార్కండేయ'లో యముడిగా నటించిన సుబ్రహ్మణ్య నాయుడుతోనే 'మహిరావణన్‌' కూడా తీసినట్లు కథనం. నటరాజ ముదలియార్‌ నిర్మించిన ఈ చిత్రాలన్నీ ఒక్కొక్కటీ సుమారు 6 వేల అడుగుల నిడివి ఉండేవి. అలాగే, ఆయనే తీసిన 'లవ కుశ'లో శ్రీరాముడిగా గోవిందస్వామి నాయుడు నటించారట! మరో చిత్రం 'రుక్మిణి - సత్యభామ'లో రుక్మిణిగా బ్రాహ్మణ యువతి జానకి నటించడం ఆ రోజుల్లో విశేషం. సత్యభామగా జీవరత్నం, శ్రీకృష్ణుడిగా నటేశ నాయుడు నటించారట!


తెరకు దూరమైన తొలి చిత్ర రూపకర్త


అయితే, ఆ తరువాత అంటే... 1923లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో నటరాజ ముదలియార్‌ స్టూడియో కాలిపోయింది. దెబ్బ మీద దెబ్బగా కుమారుడు కూడా చనిపోవడంతో, ఆయన విషాదంలో మునిగిపోయారు. చలనచిత్ర నిర్మాణాన్ని మానేసి, మళ్ళీ ఆటోమొబైల్‌ విడిభాగాల విక్రయ వ్యాపారంలోకి వెళ్ళిపోయారు. అలా ఆ తరువాతి కాలంలో సినిమాల నిర్మాణానికి దూరంగా మెలగి, ప్రజల స్మృతిపథంలో నుంచి పక్కకు తొలగిన నటరాజ ముదలియార్‌ చివరకు 1972 మే 3న మద్రాసులో కన్నుమూశారు.



మద్రాసు ఇవాళ దక్షిణ భారతదేశమంతటికీ అతి పెద్ద చిత్ర నిర్మాణ కేంద్రంగా ఎదిగింది. కానీ, ఒక్కసారి చరిత్రను గమనిస్తే - మద్రాసులో సినిమాలంటూ తీయడం మొదలైన తొలి పదేళ్ళ కాలంలో ఇద్దరే ఇద్దరు భారతీయులు చలనచిత్రాలు నిర్మించారు. వారిలో ఒకరు నటరాజ ముదలియార్‌. రెండో వ్యక్తి - తెలుగు చలనచిత్ర పితామహుడైన రఘుపతి వెంకయ్య కుమారుడు ఆర్‌. ప్రకాశ్‌. (వీళ్ళిద్దరూ కాక సినిమాలు తీసింది - వైటకెర్‌ అనే ఓ పాశ్చాత్యుడు మాత్రమే!). దక్షిణాదిలో చలనచిత్ర నిర్మాణానికి బీజం వేసిన నటరాజ ముదలియార్‌ కృషి, ఆయన రూపొందించిన తొలి దక్షిణాది చలనచిత్రం 'కీచక వధమ్‌' ఇప్పటికీ, ఎప్పటికీ స్మరణీయమే!

Monday, November 28, 2011

ధిక్కార స్వరానికి నిలువుటద్దం మా కాళోజీ..

కాళోజీ..
ధిక్కార స్వరానికి నిలువుటద్దం..
మానవత్వపు మనుగడకు
నిలువెత్తు నిదర్శనం..
ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో పరితపించిన మహనీయుడు...
ఆయన వ్యక్తిత్వం నిఖార్సయిన ప్రశ్నల కొడవలి..
ఆయన ఖలేజాకు జీ హుజూర్.
ఈ రోజు కాళోజీ వర్థంతి సందర్భంగా ఈ సిల్‌సిలా.

హన్మకొండలోని నక్కలగుట్ట ప్రాంతంలో కాళోజీ నారాయణ రావు ఇంటికి వెళ్లాం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లోకి అడుగుపెడుతోంటే ‘ఏంరా.. ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నిస్తున్నట్లు కాళోజీ చిత్రపటాలు ఉన్నాయి ఆ గదిలో. ఓ అల్మారాలో పద్మవిభూషణ్ అవార్డు అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకవూటామన్ కాళోజీకి అందిస్తోన్న ఫొటో. వాటి ముందు ఒక సోఫాలో మౌనమునిలా కాళోజీ నారాయణరావు కుమారుడు కాళోజీ రవికుమార్ కూర్చున్నారు. ‘అమ్మగారు లేరా’ అని అడిగితే.. ‘కూర్చొండి’ అంటూ సైగ చేశారు. నాన్నగారి గురించి, ఆయన జ్ఞాపకాల గురించి చెబుతారా? అన్న ప్రశ్నకు జవాబుగా ఆయన మిగిల్చిన వారసత్వాన్ని, త్యాగాన్ని, తెలంగాణ పట్ల, దేశరాజకీయాలపట్ల, తన తండ్రితో తనకున్న సాన్నిహిత్యాన్నీ ఇలా వివరించారు.

ఆయనతో స్నేహబంధమే..
మా నాన్నగారితో నాకు స్నేహబంధమే ఉండేది. అయినా ఆయనతో మాట్లాడాలంటే భయం. ఆయన బయట అనేక రకాల అభివూపాయాలతో ఉండేవారు. ఇంట్లో మాత్రం గంభీరంగా ఉండేవారు. ఆయన చేసిన త్యాగం, తెలంగాణ కోసం తపించిన సందర్భాలు గుర్తుకువచ్చినప్పుడల్లా దుఃఖం వస్తుంది. నేను చదువుపట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. పదో తరగతి వరకే చదువుకున్నాను. నాకు చదువు మీద కంటే ఇతరత్రా అంశాలపట్ల మక్కువ ఉండేది. మా నాన్నగారి దగ్గరికి చాలామది వస్తుండవారు. రకరకాల స్వభావాలు, అభివూపాయాలు కలిగి ఉండేవారు. నా కంటే ముందు అన్నయ్య, అక్కయ్య, తమ్ముడు పుట్టిపోయారు. ఇప్పుడు నేనొక్కడినే. నాకూ మా బాబు (పేరు సంతోష్. ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్) ఒక్కడే. నన్ను చాలా మంది కాళోజీగారి అబ్బాయి అని, కొంతమంది రవికుమార్ అని, మిత్రులు చిన్నకాళోజీ అని సంబోధిస్తుంటారు. నాకు 55 ఏళ్లు యిప్పుడు. ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది. ఆయన ఏం సంపాదించారో. ఆయన దేశం కోసం, తెలంగాణ కోసం చేసిన త్యాగం ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. నేను నాన్నగారితో మాట్లాడేందుకు భయపడేవాడ్ని. ‘నీకేం కావాలో పెద్దనాన్నగారిని అడిగి తీసుకో.. నా అవసరం ఏమిటీ? నాకు లోకంతో పని. లోకంతో నాకూ పని ఉంది. వారు అనేక కష్టాల్లో ఉన్నారు. వారిని నేను చూసుకుంటాను. నీకు కావలసినవన్నీ పెద్దనాన్న చూసుకుంటారు’ అని అనేవారు ఆయన. నాకేం కావాలన్నా మా పెద్దనాన్న కాళోజీ రామేశ్వరరావునే అడిగేవాడ్ని. నాకు కావలసివన్నీ చిన్నతనం నుంచి ఆయనే సమకూర్చేవారు.

నాన్నగారి కోసం అనేక మంది దేశం నలుమూలల నుంచి వచ్చేవాళ్లు. సాహిత్యరంగంలో శ్రీశ్రీ మొదలు, దాశరథి సోదరులు, సినారె, బిరుదురాజు రామరాజు, పల్లా దుర్గయ్య ఇలా ఎంతో మంది వచ్చేవారు. ఎవరు వరంగల్‌కు వచ్చినా ఆయనతో మాట్లాడందే తిరిగి వెళ్లేవాళ్లు కాదు. వాళ్లు మాట్లాడుతుంటే నేను వినేవాణ్ణి. వారిలా ఆలోచించే వాణ్ణి. కానీ నేను వారిలా తయారుకాలేదన్న బాధ నాకిప్పటికీ ఉంటుంది. నేను చదివిన చదువుకు తగ్గట్టుగా అప్పుడు నాకు ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగం వచ్చింది. నన్నందరూ కాళోజీ గారి అబ్బాయి అని చూసేది. ఆయన పేరును ఎట్టిపరిస్థితుల్లోనూ బదునాం చేయవద్దని ప్రతీక్షణం అనుకునేవాణ్ణి. ఇప్పటి వరకు ఆ పనిచేయలేదనే నమ్ముతాన్నేను. నేను ఇప్పుడు వీఆర్‌ఎస్ తీసుకొని ఇంటివద్దే ఉంటున్నాను. సాహిత్యంలో పెద్దగా ప్రవేశం లేకపోయినా నాన్న వారసత్వంగా వచ్చిన అక్షరాల కోసం నగరంలో జరిగే సాహితీసభలకు వెళుతుంటాను. మిత్రమండలి సమావేశానికి క్రమం తప్పకుండా హాజరవుతుంటాను.

దేశమంత ఇల్లు కట్టుకున్నారు: రుక్మిణిబాయి
ఆయన దేశాలు తిరిగేది. ఇంటిపట్టున ఉండేవాడు కాదు. ముక్కుసూటి మనిషి. బయట ఏదన్నా ఘోరం జరిగిందని తెలిస్తే వలవలా కన్నీళ్లు కార్చేవారు. నాకు 12 ఏళ్ల వయస్సున్నపుడే ఆయనతో పెళ్లి అయింది. ఇప్పుడు 87 సంవత్సరాలు. ఆయన ఇంటిని పట్టించుకోలేదు. కానీ ఈ దేశమంతా ఇల్లుకట్టుకునే ఉన్నారు. అందరూ ఆయనను ఆరాధనగా కొలుస్తుంటే నాకు ఇంకేం కావాలనిపిస్తది. ఆయనతో మాట్లాడాలంటే ఇంట్లో వాళ్లు భయపడేది. మాకు పెళ్లయిన కొత్తలో వరంగల్‌లో ఉండేవాళ్లం. ఆయన దేశాలు పట్టుకొని తిరిగేవారు కదా. మొదట పెళ్లే వద్దన్నాడట. కానీ ఆయన గురువు డి.రాజా(రాజేశ్వరరావు) నాకు మేనమామ. ఆయన కుదిర్చిన పెళ్లే. పెళ్లిచూపుల తరువాత నాలుగోనాడు నన్ను ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకున్నాడు. మా అత్తామామలు రమాబాయి, రంగారావులు. మా బావగారు రామేశ్వరరావుగారే ఇంటిని చూసుకున్నారు. కొంతకాలం మేం వరంగల్‌లో ఉన్నాం. అప్పుడొకసారి ఆయన దేశాలుపట్టుకొని తిరుగుతున్నప్పుడు మేం ఉంటున్న కిరాయి ఇంటిని ఖాళీ చేయమన్నారు. ఏదో మాటవరుసకు అంటున్నారు కదా అని అనుకున్నాను. కానీ వాళ్లు మా సామాను అంతా ఓ బండిలో వేసి మా బావగారి ఇంటికి పంపారు. అప్పటి నుంచి ఇదిగో ఇక్కడే ఉంటున్నాం. (కాళోజీ నారాయణగారికి ఇప్పటికీ ఆయన పేరుమీద ఓ సొంత ఇల్లూ కూడా లేదు. ఆయన ఎమ్మెల్సీగా, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడిగా ఉన్నారు). ఆయన జ్ఞాపకాలంటే ఎన్నని చెప్పను. రోజూ ఈ గదిలో కూర్చొని ఆయనతో నేను ఢిల్లీకిపోయిన సంగతిని, విశాఖపట్నం పోయిన సంగతి గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాను. అసలు ఆయనను మరచిపోతేనా.

ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆయన ఎప్పుడూ తెలంగాణ కోసం ఆరాటపడేది. ఇది అందరికీ తెలుసు. ఆయనకు పీవీసాబ్ ఢిల్లీలో (పద్మవిభూషణ్ అవార్డు సందర్భంగా) అవార్డు ఇచ్చినపుడు ఆయనతో వెళ్లాను. అందరూ ఆయన్ని తెలంగాణ కాళోజీ అన్నారప్పుడే. అసలు తెలంగాణోళ్లకు అవార్డు కూడా ఇస్తారా? అని కొందరు ఆయనతోనే అన్నారట. దానికి ఆయన వారితో పెద్దయుద్ధమే చేశారుపూండి. ఆయన బతికినన్నాళ్లు తెలంగాణ కోసమే బతికారు. ఆయనలో సగభాగమైన నేను తెలంగాణ అనకుండా... లేకుండా ఎందుకుంటాను చెప్పండీ?

ప్రశ్నల కొడవలి..
తెలుగునాట ఆ మాటకు వస్తే యావత్ దేశంలోనే పరిచయం అవసరం లేని ధిక్కార కాగడ కాళోజీ. ఆయన అసలుపేరు రఘువీర్ నారాయణ లక్ష్మికాంత శ్రీనివాసరావు రామరాజా కాళోజీ. ఆయన 9 సెప్టెంబర్, 1914న జన్మించారు. తండ్రి రంగారావు, తల్లి రమాబాయి. అన్నయ్య ప్రముఖ ఉర్దూకవి, న్యాయవాది కాళోజీ రామేశ్వరరావు. వరంగల్ జిల్లా హన్మకొండ మండలం మడికొండ నివాసం. ఆయన ప్లీడరీ చేసినా సాహితీవేత్తగా, ఉద్యమవేత్తగా, కార్యకర్తగా, గ్రంథాలయోద్యమనాయకుడిగా, విద్యార్థి సంఘాల నాయకుడిగా, కవిగా, పౌరహక్కుల గొంతుకగా అసమ్మతీ నిరసన, ధిక్కారాల స్వరంగా అందరికీ కేరాఫ్ అడ్రస్. ఇంట్లో ఉన్నా, కోర్టులో ఉన్నా, సభలో ఉన్నా, వక్తగా ఉన్నా చివరికి జైలులో ఉన్నా ఆయన వ్యక్తిత్వం నిఖార్సయిన ప్రశ్నల కొడవలి. ఆయన చాలా మందికి ఎమ్మెల్సీ అని ఈ తరం ప్రజావూపతినిధులకు తెలియకపోవచ్చు. అలుపెరుగని ప్రజాఉద్యమ కార్యకర్తగా ఉన్న ఆయన తెలంగాణ కోసం నిత్యం తపించేవారు. 1933లో వైతాళిక సమితి స్థాపించారు. వందేమాతర ఉద్యమానికి విరాళాలు సేకరించారు. గొప్ప దేశభక్తుడు. తెలంగాణ ఆరాధ్యుడు. ఆయన అసలు సిసలు ప్రజాసామ్యవాది. ఇవన్నే కాదు ఆయన క్రికెట్ అంటే చెవి కోసుకునేవారు. ఆయనకు 1992లో పద్మవిభూషణ్ వచ్చింది. కాళోజీ కథానికలు, ఖలీల్ జీబ్రాన్ అనువాద రచ లతోపాటు అనేక మరాఠీ, బెంగాలీ, రచనలకు తెలుగు అనువాదాలు చేశారు. 1946లో పార్ధీవవ్యయంగా రూపుదిద్దుకున్న నా గొడవ ఆరు సంపుటాల సమగ్ర సాహిత్యం ఆనాటి ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆయన 13, నవంబర్ 2002లో అస్తమించారు. ఆయన వర్థంతి సందర్భంగా కాళోజీ ఫౌండేషన్ మొట్టమొదటిసారిగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సామల సదాశివ మాస్టారు (ఆదిలాబాద్, యాది సదాశివ)కు స్మారక అవార్డు ఇస్తున్నారు.

కథనం

సిల్వర్‌స్క్రీన్ మీద 24 ఫ్రేమ్స్ ఏం చెప్పాయి..కంటే ఎలా చెప్పాయి అన్నదే పాయింట్ అదే కథనం... సినిమా భాషలో నరేషన్ హిట్టూ, ఫట్టును నిర్థారించే ప్రెజెంటేషన్ దాని మీదే నేటి రంగులకల డిస్కషన్ సృజనాత్మక ప్రక్రియలన్నిట్లో వ్యక్తీకరణ ముఖ్యం. దీనికి మూలమైన అంశంగా నరేషన్ నిలుస్తుంది. కథను ఆవిష్కరిస్తూ సాగే సినిమాలకైతే ఈ నరేషన్ లైఫ్‌లైన్ లాంటిది. ప్రేక్షకుడు దృశ్యసమాహారమైన సినిమా పట్ల అనురక్తి పొందడానికి వస్తు విలక్షణతోపాటు కథనంలో కూడా వైవిధ్యాన్ని ఆశిస్తాడు. అలాంటి నరేషన్ సినిమాల్లో కథాపరమైన వివరాలు ఇవ్వడానికంటే కూడా కథకు దృశ్యరూపం కల్పిస్తూ మౌలికమైన కథాంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే ప్రాధాన్యం ఇస్తుంది.

ఆడంబరాలు...అవాస్తవికత
సినిమా తొలినాళ్లలో నరేషన్ సాదాసీదాగా కథను ముందుకు నడిపిస్తూ సాగిపోయేది. ప్రపంచంలో మొట్టమొదటి ఫిక్షన్ ఫిలింగా వినుతికెక్కిన ‘ ఎ ట్రిప్ టు మూన్’లో, ఆ తర్వాత క్రైం అంశంతో నిర్మించిన ఫస్ట్ మూవీ ‘గ్రేట్ ట్రైన్ రాబరీ’లో మూలకథకు కొంచెం కళాత్మకత తోడై నరేషన్ నేరుగా సాగుతుంది. అట్లాగే మనదేశంలో కూడా తొలి రోజుల్లో నిర్మించిన పౌరాణిక చిత్రాల్లో మూల రచనల్లో సాగిన రీతిలోనే నరేషన్ కనిపిస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ రచయితలు, దర్శకులు కొత్త ఆలోచనల్ని సంతరించుకుని సినిమా నరేషన్ విషయంలో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఫ్లాష్‌బ్యాక్, ఫిల్మ్ ఇన్ ఫిల్మ్ లాంటి వైవిధ్యభరితమైన నరేషన్ టెక్నిక్స్‌ని అమలులోకి తెచ్చారు. మరోపక్క సినిమా రంగంలో పెరుగుతూ వచ్చిన స్టార్ వాల్యూ, అధికపెట్టుబడులు తదితర కారణాల రీత్యా నరేషన్‌లో నవ్యత కంటే ఆడంబరం, అవాస్తవికత, టెక్నికల్ అంశాలపైన చలనచివూతకారుల దృష్టి మళ్లింది. ఫలితంగా తెలుగు సినిమాల్లో వైవిధ్యభరితమైన నరేషన్‌కి ఆశించినంత స్థానం లభించలేదనే చెప్పుకోవచ్చు.

డిజైసిస్
కాని ప్రపంచ సినిమాను ముఖ్యంగా యూరోప్ సినిమాను పరిశీలిస్తే సినిమా నరేషన్‌లో కథను నిర్మించడానికి అనేక సూత్రాలు, ఆనవాయితీలు పాటిస్తారు. ప్రాథమికంగా వాస్తవ ప్రపంచాన్ని తెరపై చిత్రించడానికి ప్రయత్నిస్తారు. ఫలితంగా ప్రేక్షకుడు సినిమాల్లో తనని తాను ఐడెంటిఫై చేసుకుంటాడు. లేదా తెరపై సాగే కథనంలో తానూ భాగస్వామిగా ఫీలవవుతాడు. అలా దృశ్యంలో ప్రేక్షకుడు లీనమయ్యేందుకు కథనాత్మకత, చిత్రీకరణల్లో డిజైసిస్ ప్రధాన భూమికను పోషిస్తుంది. డిజైసిస్ కథనంలోని ఇతివృత్తం, కథలోని విషయ ప్రపంచం రెండూ కలగలసిన స్థితిని సూచిస్తుంది. అంటే తెరపై కనిపించే కథావాస్తవమూ కథా సమస్తమూ డిజైసిస్‌లో ఒక భాగమన్నమాట. ఇంకా చెప్పాలంటే పాత్రలు, వాటి సంభాషణలు, వేషభాషలు, అలవాటు,్ల నటన అన్నీ డిజైసిస్‌లో అంతర్భాగమే. సినిమాల్లో వినిపించే ధ్వని, కనిపించే సెట్లు, నృత్యాల్లో హీరోహీరోయిన్లు, చుట్టూ డ్యాన్స్ చేసే ఎక్స్‌ట్రా నటీనటులు అంతా డైజిసిస్‌లో భాగమై సినిమా నరేషన్ పై ప్రభావం చూపిస్తాయి.

అయితే సినిమాల్లో ‘నరేషన్’ వాస్తవికతను ఆధారం చేసుకుని సాగినపుడు వాటిల్లోని పాత్రలన్నీ ఏదో ఒక ప్రేరణతో ముందుకు సాగుతాయి. అనేకసార్లు పాత్రల స్వభావం, వాటి చలనం వల్లే సినిమాల్లో కథ ఆవిష్కృతం అవుతుంది. ముఖ్యంగా ప్రధాన స్రవంతి సినిమాల్లో ఈ ప్రేరణ పురుష పాత్రల ఆధారంగానే ముందుకు నడుస్తుంది. దాదాపు అన్ని భాషల్లోని వ్యాపార సినిమాల్లో కథాకథనాలు పురుషదృక్కోణం నుంచే సాగుతాయి. ఎక్కడైనా స్త్రీ ప్రధాన పాత్రగా కనిపించినప్పటికీ ఆ సినిమాను చివరికి పురుష అవగాహనతోనే ముగింపు పలుకుతారు.

పారలల్ నరేషన్
ఇలా వ్యాపార చిత్రాలు, కళాత్మక చిత్రాల్లో నరేషన్ రీతులు భిన్నంగా ఉంటున్నాయి. అయినా కొందరు కథకులు, నవలాకారులు, స్క్రీన్‌ప్లే రచయితలు ప్రయోగాలకు శ్రీకారం చుడుతూ సినిమా కథనంలో విలక్షణ, వైవిధ్యాన్ని సాధించేందుకు కృషి చేస్త్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నాల ఫలితంగా ఆవిర్భవించిందే ‘పారలల్ నరేషన్’ లేదా మల్టిపుల్ నరేషన్. ఈ టెక్నిక్ మనకు నవలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నవలల్ని ఆధారం చేసుకుని నిర్మించిన సినిమాల్లో సైతం ఈ కథనశైలి కనిపిస్తుంది. మెమంటో, రన్ లోలారన్, షైన్, పల్ఫ్‌ఫిక్షన్, ది స్వీట్ హియర్ ఆఫ్టర్ లాంటి సినిమాలు వైవిధ్యమైన కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.

విజయాలు...వైఫల్యాలు
నిజానికి ఈ నరేషన్‌కి సంబంధించి ప్రపంచ సినీ చరివూతలో చేసిన ప్రయోగాల్లో కొన్ని విజయవంతమయ్యాయి. మరికొన్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ‘ షైన్’ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్ చిత్రీకరణ గొప్ప విజయాన్ని సాధిస్తే ‘సాటర్ డే నైట్’లో వైఫల్యం చెందింది. ‘సిటిజన్ కేన్’లో ఫ్లాష్‌బ్యాక్‌లు అద్భుతమైన కథనరీతికి ఉదాహరణగా నిలిచాయి. ఆ తర్వాత అంత ప్రభావంతమైన ఫ్లాష్‌బ్యాక్‌ను నిర్వహించిన వారేలేరు. అట్లాగే ‘ది స్వీట్ హియర్ ఆఫ్టర్’ సినిమాల్లోని 11 కథల్లో 9కథలు వేర్వేరు కాలాలకి చెందినవి. అలాంటి కథన ప్రయత్నం మరొకరు చేయలేదు.
అయితే సినిమా నిర్మాణానికి సంబంధించినంత వరకు కథనరీతి శిలాశాసనం కాదు. అది నిరంతరం మార్పునకు లోనయ్యే ప్రక్రియే. అట్లాగే అన్ని రకాల కథలకి ఒకే రకమైన కథనం ఉండదు. భిన్నమైన కథలకు వైవిధ్యమైన కథనశైలి కనిపిస్తుంది. అదే పారలల్ నరేషన్ (సమాంతర కథనం). ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కథనశైలిగా చెప్పుకోవచ్చు. ఈ తరహా కథనంలో అర్థవంతమైన కథా వేగం, భిన్న కథనాల మధ్య సంబంధం, చివరగా ముగింపులు ప్రధానమైనవి. అనేక కథల్ని సమాంతరంగా నడిపిస్తూ వాటి మధ్య సమన్వయాన్ని సాధించడమే ఈ నరేషన్ ప్రధాన లక్షణం. పారలల్ నరేషన్‌లో కూడా రకాలున్నాయి

ఊహలకు సమాంతరంగా...
మొట్టమొదటిది ప్లాష్‌బ్యాక్ ట్రీట్‌మెంట్. ప్రేక్షకుల ఊహలకు రెక్కలు తొడిగి వాటికి సమాంతరంగానూ, భిన్నంగానూ కథనాన్ని కొనసాగించడం ఇందులో కనిపిస్తుంది. సస్పెన్స్, క్రైం, డిటెక్టీవ్ చిత్రాల్లో ఈ టెక్నిక్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు మానసిక సంఘర్షణని సామాజిక సంఘర్షణని చూపించడానికి కూడా ఫ్లాష్‌బ్యాక్ ఉపయుక్తమవుతుంది.

మల్టిపుల్...
రెండవది ‘మల్టిపుల్ ప్రొటగనిస్టు’ శైలి. ఇందులో ముఖ్యాభినేత ఒక్కడే కాకుండా బహుపావూతలు ప్రధానమై ఒక్కొక్కటి ఒక్కో కథని ఆవిష్కరిస్తాయి. అన్నింటి మధ్యా అంతర్‌లయగా మౌళికాంశం కొనసాగుతూనే ఉంటుంది. ఈ తరహా కథనాలు ఆర్మీ, లక్ష్యం కోసం పనిచేసే దళాల కథల్లో కనిపిస్తాయి.

సీక్వెన్షియల్.. టాండెమ్
మూడవది సీక్వెన్షియల్ నరేషన్. ఇందులో భిన్నమైన కథల్ని వరుసక్షికమంలో చెప్పుకుంటూ పోతారు. ముగింపులో ఏదో ఒక అంశం ప్రాతిపదికన వాటిని కలిపేస్తారు. నాలుగవది ‘టాండెమ్ నరేషన్’. ఇందులో సమాన స్థాయిగల కథల్ని అంతే సమానంగా ఆవిష్కరిస్తారు. ఇలాంటి కథనాలు పౌరాణిక చిత్రాలకు ఉపయోగపడతాయి. ఈ పారలల్ నరేటివ్స్‌కి మరో రకమైన విభజన కూడా ఉంది. వాటిని ‘క్యారెక్టర్ బేస్’్డ పారలల్ నరేటివ్, ‘లొకేషన్ బేస్డ్’ పారలల్ నరేటివ్‌గా చెప్పుకోవచ్చు. క్యారెక్టర్ బేస్డ్ పారలల్ నరేషన్‌లో ప్రేక్షకుడు సినిమా కథని సమక్షిగంగా అర్థం చేసుకోవడానికి విభిన్న పాత్రల దృష్టికోణాలు దోహదం చేస్తాయి. లొకేషన్ బేస్డ్ పారలల్ నరేటివ్‌లో ఒక ప్రత్యేకమైన లొకేషన్‌లో జరిగే పలుసంఘటనల్ని ప్రేక్షకుడు వీక్షించే స్థితి ఉంటుంది. ఇలా పలురకాలుగా ఉన్న సమాంతర కథనాల ద్వారా భిన్న అంశాలు చర్చిండానికి, వైవిధ్యమైన నేపథ్యాల్ని సృజించడానికి ప్రయత్నాలు జరగుతున్నాయి. ఇవ్వాళ్టి వేగంలో ప్రేక్షకలోకానికి అనువైన కథనశైలి ఈ పారలల్ నరేషన్. అయితే దీన్ని నిర్వహించడంలో దర్శకుడి ప్రతిభ బయటపడుతుంది. ఎలాంటి సందిగ్ధతలకు తావులేకుండా భిన్న కథనాల్ని మౌళిక కథాంశాన్ని ఇరుసుగా చేసుకుని నిర్వహించినపుడే అది విజయవంతమవుతుంది. ప్రతికళ మారుతున్న కాలానికి అనుగుణంగా స్పందించాల్సిందే. ఆ మార్పుల్ని తనలో ఇముడ్చుకోవలిసిందే. ఏ కళ అయినా, సినిమా అయినా సరిహద్దుల్ని చెరిపేసేదిగా ఉండాలి. అప్పటిదాకా స్థిరపడ్డ అన్ని లక్షణాల్ని ఛేదించుకుని నవ్యరీతులకు దారులు తీయాలి.

తెలుగు సినిమాల్లో తెలుగెంత?

నేతి బీరకాయలో నేయి ఉంటుందా?
పులిహోరలో పులి ఉంటుందా?
మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా?
ఈ ప్రశ్నలు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ప్రస్తుతం తెలుగు సినిమాలో తెలుగు భాష- సంస్కృతి పరిస్థితి అలాగే ఉంది. తెలుగులో తొలి టాకీ సినిమా విడుదలై నిన్నటికి ఎనభై సంవత్సరాలు. ప్రస్తుతం 81 వ ఏట అడుగు పెట్టిన తెలుగు సినిమాలో తెలుగుదనం ఎంత?గత కొంతకాలం నుంచి మనకు తరచూ వినిపిస్తున్న మాట... అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న మాట...‘తెలుగు భాష కనుమరుగై పోతోంది. తెలుగు భాషలో తెలుగు భ్రష్టుపట్టిపోతోంది. తెలుగుకు తెగులు తగులుకుంది’ అని. అయితే ఈ పరిణామం ఒక్క భాషకు మాత్రమే కాదు. సర్వకళల సమాహారమైన తెలుగు సినిమాకూ తప్పడం లేదు. జీవసంస్కృతులను కొనసాగించేవి కళలే అనుకుంటే, అలాంటి కళలన్నింటికీ రారాజు అయిన సినిమాలో మాత్రం తెలుగుదనం ఏమేరకుంది అని ఆలోచించాల్సిన తరుణం ఏర్పడిందిప్పుడు. కథల్లో, కాస్ట్యూమ్స్‌లో, లొకేషన్స్‌లో, మాటల్లో, పాటల్లో, యాక్షన్‌లో... ఆఖరికి హీరోయిన్‌లలో, సినిమా టైటిల్స్‌లో అసలు తెలుగెంత అని ఆలోచిస్తే నిరాశే ఎదురవుతుంది.

నేటికి 176 ఏళ్ల క్రితం...తెలుగు సినిమా పుట్టడానికి 104 ఏళ్ల కిందట
1835వ సంవత్సరం...బ్రిటీష్ పార్లమెంట్‌లో భారతదేశంలో విద్యావిధానంపై చర్చ జరుగుతోంది. ప్రత్యేకంగా నియమించిన కమిటీ ఛైర్మన్ అయిన లార్డ్‌మెకాలే సభకు వివరణ ఇస్తున్నాడు... సభలో ప్రతిపక్ష సభ్యుడొకరులేచి అసలు భారతదేశంలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడం వల్ల మనకొచ్చే ప్రయోజనమేంటి? అనడిగాడు. అప్పుడు మెకాలే చిన్నగా గొంతు సవరించుకుని ఇలా చెప్పాడు ‘by this system of english education, they may be indians by blood and color, But will become britishers in tastes, opinions, manners and intellect’ (ఆంగ్ల విద్యా విధానం వల్ల రంగు-రక్తం- పరంగా భారతీయులైన వీరంతా అభిరుచులు- అభివూపాయాలు- పద్ధతులు, మేధాశక్తి పరంగా క్రమక్షికమంగా బ్రిటీష్‌వారిగా మారుతారు)
మెకాలే కల నిజమైంది.

ఇలాంటి సాంస్కృతిక విధ్వంసమే ఇప్పుడు తెలుగు సినిమాకూ జరుగుతోంది. తెలుగుదనం, తెలుగు అని గొప్పగా చెప్పుకొంటున్న జనాలు చూసే తెలుగు సినిమాల్లో తెలుగుదనం ‘నేతి’గా మారింది.

కథల సంగతి
సినిమాకు కథే ప్రాణం! చాలా ప్రెస్‌మీట్లలో అందరూ చెప్పే అరిగిపోయిన మాట ‘స్క్రిప్టే మా హీరో’ అని. అంటే తెలుగు సినిమా భవనానికి పునాది కథ అన్నమాట. కానీ 1931 నుంచి ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన సినిమాలన్నిటినీ గమనిస్తే , ఇందులో తెలుగుదనాన్ని ప్రతిబింబించిన కథపూన్ని? అసలు తెలుగు కథపూన్ని? అని పరిశోధన చేస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేము. ఈ ఎనభై ఏళ్లకాలంలో తెలుగులో దాదాపు 5900 సినిమాలు వచ్చాయి. వాటిలో 65 శాతం పైగా సినిమాలకు మూల కథలు బెంగాలీ, హిందీ, తమిళం, మలయాళం సినిమాలే. అంటే కేవలం 35 శాతం సినిమాలు మాత్రమే మనదైన సొంత కథలలతో రూపొందాయన్నమాట. మిగతావన్నీ అరువు కథలో లేక రీమేక్‌లో అన్నమాట. ఆ లెక్కన అసలు సినిమాకు ఆది పునాది అయిన కథే మనది కానప్పుడు సినిమాలు మాత్రం మన అవుతాయి?
1950,60వ దశకాలలో తెలుగు సినిమాలకు ముడి సరుకు అంతా బెంగాళీ కథలే. ఆ తర్వాత 1970,80 దశకాల్లో సూపర్‌హిట్ అయిన హిందీ సినిమాలను రీమేక్ చేయడం ఓ వెల్లువలా సాగింది. 1980,90 దశకాల కాలం నుండి తమిళ సినిమా రీమేక్‌లు విజృంభించాయి. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. తెలుగు సినిమా అన్ని తరాలలోని సూపర్ హీరోలందరూ పరభాషా కథలతో, సినిమాలు తీసినవారే. దేవదాసు, బాటసారి వంటి సినిమాలు బెంగాలీ సినిమాలకు రీమేక్‌లే.

అన్నదమ్ముల అనుబంధం(యాదోంకీ బారాత్), నిప్పులాంటి మనిషి(జంజీర్), అమరదీపం(ముకద్ధర్ కా సికిందర్), తూర్పు పడమర(అపూర్వ రాగంగాళ్), పదహారేళ్ల వయసు(పదునారు వయదినిలే) వంటి సినిమాలన్నీ రీమేక్‌లే. చిరంజీవి చేసిన త్రినేవూతుడు(జల్వా), ఘరానామొగుడు(మన్నన్), స్నేహం కోసం( నాట్లామై), హిట్లర్(), ఠాగూర్(రమణ).... వంటి సినిమాలన్నీ పరభాషా కథలతో నిర్మాణమైనవే. మోహన్‌బాబు నటించిన అల్లుడుగారు, తప్పుచేసి పప్పుకూడు, పెదరాయుడు వంటి సినిమాలకు మలయాళ కథలే ఆధారం. ఇక వెంక అయితే పరాభాషా కథలతో తెలుగు సినిమా నిర్మాణానికి కేరాఫ్‌గా మారారు. చంటి(చిన్నతంబి), రాజా, శీను, కొండపల్లి రాజా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నాగవల్లి, లేటెస్ట్‌గా రాబోతున్న ‘గంగ ది బాడీగార్డ్’ కూడా రీమేక్‌లే. నేటితరం హీరోల్లో ‘నా ఆటోక్షిగాఫ్(ఆటోక్షిగాఫ్), దొంగోడు(మీసమాధవన్), వీడే(ధూల్), అన్నవరం(తిరుప్పాచ్చి), ఖుషీ, తీన్‌మార్(లవ్ ఆజ్‌కల్), బిల్లా, నాని(న్యూ), లక్ష్మీ నరసింహా(సామి), ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న గబ్బర్ సింగ్(దబంగ్) సినిమాలూ అలాంటివే.ఇక తెలుగు సినిమాలలో హాలీవుడ్ కథల కాపీయింగ్, ఫ్రీమేకింగ్ అనేది గత ఎనభై ఏళ్లుగా సాధారణ సత్యమైపోయింది. ‘ఇన్‌స్పిరేషన్’అనే అందమైన పేరుతో హాలీవుడ్ కథలను అరువు తెచ్చుకోవడం ఓ తప్పనిసరి అంశమైపోయింది.అయితే భాషా వ్యాప్తిలోనూ, సంస్కృతి విస్తరణలోనూ కళారూపాల సార్వజనీనతలోనూ ఇలాంటి ‘ఆదాన ప్రదానాలు’ సర్వసాధారణమే. ఇలాంటి ఇచ్చిపుచ్చుకునే ధోరణుల వల్ల సినిమా కళ కూడా ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇచ్చిపుచ్చుకోవడంలో ‘పుచ్చుకోవడం’ ఎక్కువైపోవడమే ఒకింత బాధాకరం.

క్యాస్టూమ్స్ లొకేషన్స్
సినిమా కళలో పాత్ర స్వభావాన్ని ఇట్టే వ్యక్తీకరించే సాధనం క్యాస్టూమ్స్. ఆహార్యం అని మన ప్రాచీన అలంకారికులు పిలిచే కాస్ట్యూమ్స్- మేకప్ విషయంలో కూడా తెలుగేతర సంస్కృతే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో హీరోల డ్రెస్‌కోడ్ ఎక్కువగా సూటు-బూటు ఉండేవి (మెకాలే ఊహకు సాక్ష్యాలివే). ఆఖరికి పాటలోని సంగీత వాయిద్యం తబలా ధ్వని అయినప్పటికీ దృశ్యంలో మాత్రం ‘పియానో’ మీద పాడుతున్నట్టుగా చూపించిన తీరే (పగలే వెన్నెలా) తెలుగు సినిమాల్లో తెలుగుదనం కనుమరుగవుతున్న క్రమంలో జరిగిన తొలి పరిణామాలని చెప్పాలి.ఇక 1970, 80 దశకాలలో‘మాస్ హీరో’ పేరుతో హీరోలకు వేసే కాస్ట్యూమ్స్‌లో ఎక్కడా తెలుగుదనం మచ్చుకైనా కనిపించదు. పైగా బెదిరిపోయే కలర్స్(యెల్లో షర్ట్, రెడ్ ప్యాంట్ వంటివి)తో డిజైన్ చేసిన ఈ కాస్ట్యూమ్స్‌ని చూస్తే కుక్కలు వెంటపడటం ఖాయం అనిపించేది.

1990 దశకం నుంచి హీరోల కాస్ట్యూమ్స్ కొంతవరకు కంటెంపరరీ ధోరణిని, మన నేటివిటీని ప్రతిబింబించినప్పటికీ, హీరోయిన్‌ల కాస్ట్యూమ్స్ మాత్రం హాలీవుడ్ స్టయిల్‌లోకి వెళ్లిపోయాయి. ఇక ఇప్పుడు యంగ్‌హీరోలు, హీరోయిన్లు వేస్తున్న కాస్ట్యూమ్స్, హెయిర్ స్టయిల్స్, గెటప్స్ సంగతి తెలిసిన విషయమే.‘లొకేషన్’ అనేది సినిమా కథలోని మూడ్‌ను, స్థితిని చెప్పే ‘అదృశ్య క్యారెక్టర్’ అని అంటారు. ఇప్పటి సినిమాల్లో ‘విజువల్ రిచ్‌నెస్’, ‘డిఫంట్ లుక్’ పేరుతో ఇతర రాష్ట్రాలు, ఆఖరికి సినిమా మొత్తం (ఆంజ్) విదేశాల్లోనే చిత్రించడం పెరిగిపోయింది. ఇలా మనవి కాని లొకేషన్లు, ప్రదేశాలలో సినిమాని తీయడం కూడా నేటి సినిమాల్లో తెలుగుదనం ఎంత అనే ప్రశ్న ఉత్పన్నమవడానికి దారి తీస్తోంది.

టాలీవుడ్ ఏంటి?
అనుకరణ ‘కాపీ క్యాట్ కల్చర్’కు తెలుగు సినీ పరిక్షిశమను ఇప్పుడు పిలుస్తున్న ‘టాలీవుడ్’ అనే పేరే నిఖార్సయిన ఉదాహరణ. 1960ల వరకు ‘తెలుగు చలన చిత్ర సీమ’ అనే పేరు కాస్తా 1970 తర్వాత ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’ అయింది. గత 15ఏళ్ల నుండి శాటిలైట్ టీవీ ఛానెల్స్, వెబ్‌సైట్స్ విజృంభించాక ‘టాలీవుడ్’ అంటూ ప్రచారంలోకి వచ్చింది. అమెరికన్ ఇంగ్లీష్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్. దానికి అనుకరణగానే ఈ పేరు వ్యవహారంలోకి వచ్చింది(పేరులో కూడా సొంత తనం లేదు!). అయితే టాలీవుడ్ అనే పేరు ఎంతవరకు సరైంది అనేది మరో ప్రశ్న. ఎందుకంటే టాలీవుడ్ అనే పేరును మనదేశంలో రెండు సినీ పరిక్షిశమలకు ఉపయోగిస్తున్నారు. అవి బెంగాలీ సినీ పరిక్షిశమ, మన తెలుగు చిత్ర పరిక్షిశమ. బెంగాలీ పరిక్షిశమను టాలీవుడ్ అనడంలో అర్థం ఉంది. ఎలాగంటే కోల్‌కతాలోని ‘టాలీగంజ్’ అనే ప్రాంతంలో బెంగాలీ సినీ పరిక్షిశమ ఉంది కనుక. ఆ ఏరియా పేరుతో టాలీవుడ్ అని పిలవడం ఔచిత్యంగా అనిపిస్తోంది. కాని మనకెంత వరకు ఇది రైట్? పైగా ఆ మధ్య హీరో రానా మన సినీ పరిక్షిశమను టాలీవుడ్ అని పిలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. చక్కగా మన భాషలో తెలుగు చలన చిత్ర పరిక్షిశమ అనొచ్చు కదా అనేది ఆయన వాదన.

దిగుమతి హీరోయిన్‌లు
సినిమాకు గ్లామర్‌ను, ఆడియెన్స్‌కు మనోల్లాసాన్నిచ్చే తెర సుందరి హీరోయిన్. కానీ తెలుగు తెరపై గత కొన్నేళ్ల నుంచీ తెలుగు అమ్మాయిలు హీరోయిన్ పాత్రల్లో కనిపించడం లేదు. హీరోయిన్ అనగానే- సావిత్రి, జమున, కృష్ణకుమారి గుర్తొచ్చేవారు. ఆ తర్వాతి తరంలో వాణిశ్రీ, ఆ నెక్ట్స్ తరంలో జయవూపద, జయసుధ. తెలుగు హీరోయిన్లలో విజయశాంతి, భానువూపియలదే చివరి తరం. ఇప్పటి జనరేషన్ హీరోయిన్‌లందరూ దిగుమతి అవుతున్న వారే తప్ప తెలుగు వారు లేరు. లయ, స్వాతి, బిందుమాధవి వంటి అమ్మాయిలు హీరోయిన్‌లుగా చేసినప్పటికీ అంతగా హిట్ కాలేదు. అయితే ఈ దిగుమతి హీరోయిన్‌ల ట్రెండ్ ఇప్పుడే మొదలైంది కాదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలోనే వహీదా రెహమాన్(రోజులు మారాయి) వంటి వారితో వచ్చింది. ఆ తర్వాత శ్రీదేవితో ఊపందుకుని నగ్మా, సౌందర్యతో పతాకస్థాయికి చేరింది. ఆఖరికి తెలుగమ్మాయి’ అనే టైటిల్‌తో వస్తున్న సినిమాలో నటిస్తున్న సలోని కూడా తెలుగు అమ్మాయి కాదు. ఇక తెలుగు సినిమాల్లో తెలుగు అందం ఎక్కడ ఉంది?

సినిమా టైటిల్స్ కూడా...
తెలుగులో ప్రతి ఏటా దాదాపు 120 నుంచి 140 స్ట్రయిట్ చిత్రాలు విడుదలవుతున్నాయి. వీటిలో దాదాపు 40 నుంచి 50 సినిమాలకు టైటిల్స్ ఇంగ్లీష్ పదాలు, పేర్లే ఉంటున్నాయి. టైటిల్స్ క్యాచీగా ఉండడం పబ్లిసిటీ పరంగా నిజమే కానీ, తెలుగుదనం పరంగా ఇది గొడ్డలిపెట్టే. ఈ విషయంలో తమిళ సినీ పరిక్షిశమను అభినందించకుండా ఉండలేం. అక్కడి సినిమాలకు తప్పనిసరిగా తమిళ పేర్లే పెట్టాలని ఇండస్ట్రీ అంతా నిర్ణయించుకున్నారు. ఆ మేరకే టైటిల్స్ అన్నీ తమిళంలోనే పెడ్తున్నారు. అక్కడి టైటిల్స్ ‘నేటివిటీ ఫీల్’తో ఎంతో కవితాత్మకంగా ఉంటున్నాయి. (కన్నత్తిల్ ముద్దమిట్టల్- చెక్కిలిపై చిరుముద్దు). అవే సినిమాలు తెలుగులో డబ్ అయ్యే సరికి ఇంగ్లీష్ టైటిల్స్‌లోకి మారుతున్నాయి.
ఉదా: యంతిరన్- తెలుగులో రోబో.
ఆ మాటకొస్తే తెలుగు సినిమాల్లో తెలుగుదనం కొరవడడానికి ఆదిలోనే బీజం పడిందని చెప్పాలి. తొలి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’ టైటిల్‌ను తీసుకోండి. తెలుగు భాష ప్రకారం పేరు ఎలా ఉన్నా చివర మాత్రం ‘డు’ అనే ప్రత్యయం చేరడం సంప్రదాయం. ఆ లెక్కన భక్త ప్రహ్లాద సినిమా టైటిల్ భక్త ప్రహ్లాదుడు కావాలి. కానీ ఇక్కడ సంస్కృతంలోని ప్రహ్లాద కాస్తా హిందీలోని ప్రహ్లాదగా మారి తెలుగులో కూడా అదే పేరుగా ఫిక్స్ అయిపోయింది.

యాక్షన్-మాటలు- పాటలు
తెలుగు సినిమాల్లో తెలుగుదనం ‘మిస్’ అవడానికి యాక్షన్-ఫైట్ సీక్వెన్సులు కూడా ఓ కారణమే. ఫైట్స్‌ని తెరపై చూస్తున్నప్పుడు ఏ హాలీవుడ్ హీరో ముఖానికో మన తెలుగు హీరో ముఖాన్ని ‘మార్ఫింగ్’ చేసి పెట్టినట్టనిపిస్తాయి. అలాగే డైలాగులు, పాటల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. పాటల్లో ఇంగ్లీష్ వాక్యాలు, ర్యాప్ పదాలు ఇప్పటి సంగీత స్వరాలలో కామన్ అయిపోయాయి. తెలుగు వారి సంగీత వాయిద్యాలైన తబల, మృదంగం, వీణ వంటి స్థానాన్ని ఇపుడు డ్రమ్స్, గిటార్‌లు ఆక్రమించుకున్నాయి. ఇక కొన్ని సినిమాల్లోనైతే వెరైటీ పేరుతో ఏకంగా హిందీ(యే మేరా జహా- ఖుషీ), ఇంగ్లీష్( లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్- తమ్ముడు) పాటలనే పెట్టారు.

మాండలిక సినిమానే ఆశ
మెయిన్‌వూస్టీమ్ కమర్షియల్ సినిమా ‘తెలుగుదనాన్ని’ అట్నుంచి నరుక్కొస్తుంటే దాన్ని కాపాడుతున్నది మాత్రం మాండలిక సినిమానే అని చెప్పాలి. నేటివిటీ ఉన్న కథలు, జన జీవనంలోని సంఘర్షణలే ఇతివృత్తంగా తెలుగు సాహిత్యంలో మాండలిక కథలు(రాయలసీమ- తెలంగాణ- ఉత్తరాంధ్ర) ఎలా అయితే సజీవ భాష- సంస్కృతులతో వస్తున్నాయో, సినిమాల్లో కూడా తెలంగాణ, ఉత్తరాంధ్ర మాండలిక సినిమాలు విస్తృతంగా రావలసిన అవసరం ఉంది. చిల్లర దేవుళ్లు, మా భూమి, రంగుల కల, మట్టి మనుషులు, దాసి వంటి సినిమాలు ఇటీవలి జై బోలో తెలంగాణ, గంగ పుత్రులు వంటి సినిమాలు తెలుగు మట్టి పరిమళాలతో తెలుగుదనంలో కనిపిస్తాయి. ప్రస్తుత ప్రపంచం అంతా గ్లోబలైజ్ అవుతున్నా మెయిన్ స్ట్రీమ్ కల్చర్‌కు భిన్నంగా ఉప సంస్కృతులైన మాండలిక సినిమాలే విస్తృతంగా రావలసి ఉంది. అప్పుడు వేలాది మెకాలేలూ, వందలాది హాలీవుడ్‌లూ ఏమీ చేయలేవు.

పాటల తోటలో మన పారిజాతం ...దాశరథి

దాశరథి పేరు చెబితేనే తెలంగాణ ఆత్మవిశ్వాసం తొణికిస లాడుతుంది. కవిత్వంలోనే కాదు, సినిమా పాటల్లోనూ ఉన్నత సాహిత్య విలువలకు ఆయన ఎప్పుడూ పెద్దపీటే వేశారు. సామాన్యుల నుండి భాషావేత్తలు, సినీ పండితుల వరకు ఎందరివో ప్రశంసలు ఆయన కంఠహారాలైనాయి. ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు, నిన్ను బోలిన రాజు మా కెన్నడేని, తీగెలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని తెలంగాణ తేజాన్ని తెలుగు సాహిత్యంలోకి రంగరించిన కవి బెబ్బులి మన దాశరథి.

ఆయనది మొత్తం తెలంగాణ సాహిత్యంలో బహుముఖమైన ప్రతిభ. ఆనాటి నిజాం నవాబు నిరంకుశత్వాన్ని జైలు గోడలమధ్యే గర్జించి సవాలు చేసిన కలం వీరుడాయన. తొలితెలుగు సినీకవి చందాల కేశవదాసు తర్వాత గేయ రచయితగా సినీ పరిక్షిశమలోకి అడుగిడిన వారు దాశరథి. మనసు కవి ఆత్రేయ దర్శకత్వంలో 1961లో వచ్చిన ‘వాగ్దానం’ చిత్రం ద్వారా దాశరథి కృష్ణమాచార్య తొలిసారిగా ‘సినీకవి’గా పరిచయమయ్యారు. ఇందులో ఆయన రాసిన ‘నా కంటిపాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలవనీరా’ అన్న పాట ఈనాటికీ తెలుగు సినిమా పాటల చరివూతలోనే శిఖరస్థానంలో ఉంది. అదే సంవత్సరం దుక్కిపాటి మధుసూధనరావు ‘ఇద్దరు మిత్రులు’ చిత్రం కోసమూ ఆయన పాటలు రాశారు.


కృష్ణమాచార్యులు 1927 జులై 22న వరంగల్ జిల్లా చిన్న గూడూరులో దాశరథి వెంకటాచార్యులు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. సంస్కృత, ద్రావిడ భాషల్లో విద్యాభ్యాసం చేశారు. తల్లివద్ద తెలుగు నేర్చుకున్నారు. బడిలో ఉర్దూ భాషను ఔపోసన పట్టారు. కొన్నాళ్లు మదరాసులో, తర్వాత ఖమ్మం జిల్లాలో ఆయన చదువు సాగింది. హైదరాబాద్‌లో ఆంగ్లంలో పట్టభవూదులైనారు.
దాశరథి ఎంత అక్షర సైనికుడో అంత మానవతా హృదయం ఉన్న మనిషి. గార్లలోని కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభల్లో చేరి, అనేక పోరాటాలలో పాలుపంచుకున్నారు. అడవుల్లో తిరుగుతూ, కోయలతో కలిసి జీవించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పలుమార్లు జైలుకు వెళ్లారు. చివరికి ‘పోలీసు చర్య’ తర్వాతే విడుదలయ్యారు. ఈ పోరాట నేపథ్యమే ఆయనలో కవితా జ్వాలను పుట్టిస్తే, జీవితంలో ఎదురైన అనేక కష్టాలు సినీకవిగా అద్భుత గేయాలను పండించాయి.

గేయ రచనా స్రవంతిలో...
‘ఇద్దరు మిత్రులు’లో ఎస్8.రాజేశ్వర్‌రావు సంగీతంలో దాశరథి రాసిన రెండు పాటలూ గొప్పవే. మొదటిది ‘ఖుషిఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ’, రెండోది ఖవ్వాలి పాట. దీనితోనే తెలుగు సినిమాల్లో ఖవ్వాలి పాటలకు శ్రీకారం చుట్టారాయన.

ఆ రోజు మొదటి పాట ఓకే కాగానే దుక్కిపాటి ‘‘మాకు ఖవ్వాలి పాట కావాలి’’ అన్నారు. ఆయన ముందుగానే ట్యూన్ చేసి సాహిత్యాన్ని రాయించుకునేవారు. ఎస్.రాజేశ్వర్‌రావు పద్ధతీ ఇదే. అలా ఆయన ట్యూన్ వినిపించాక మరీ ‘‘చాలా కష్టమండోయ్ రాయడం’’ అని కూడా అన్నారు. దాశరథి ‘‘అవును కష్టంగానే ఉందని’’ రెండు క్షణాలు ఆలోచించి ‘‘నవ్వాలి నవ్వాలి, నీ నవ్వులు నాకే ఇవ్వాలి’’ అని అన్నారు. అంతే, అందరు ఆశ్చర్యపోయారు. ట్యూన్‌కి ఆ పదాలు అల్లుకు పోయాయి. నిమిషాల్లో పాటంతా పూర్తయ్యింది. ‘‘అమ్మో! హైదరాబాద్ దెబ్బ గట్టిదే’’ అనుకున్నారట అంతా. ఇలా మొదలైన దాశరథి సినిమా పాటల ప్రస్థానానికి తిరుగు లేకుండా పోయింది. ఆ తర్వాత దాశరథి అన్నపూర్ణ వారి చిత్రాలకు, ఆదుర్తి వారి చిత్రాలకు ఎక్కువగా పాటలు రాశారు.

దాశరథి సినిమాల్లోకి వచ్చేనాటికే పరిక్షిశమల్లో సీనియర్ సమువూదాల, కొసరాజు, పింగళి, శ్రీశ్రీ, ఆత్రేయ, కృష్ణశాస్త్రి, ఆరుద్ర వంటి దిగ్గజాలు, సినీ కవులుగా ప్రసిద్ధులు. వీళ్ల నడుమ ఆయన తనను తాను సినీకవిగా రుజువు చేసుకోగలగడం సామాన్య విషయం కాదు. ‘మొదటి బంతే సిక్సర్ పోయినట్టు’ తొలి పాటలే పరిక్షిశమలో మారుమోగాయి. ఇదే ఆయనకు పెద్ద బ్రేక్.

ఆత్రేయ మనుసు పాటలు, విరహ గీతాలకు, కొసరాజు జానపదాలకు, శ్రీశ్రీ అభ్యుదయ గీతాలకు, కృష్ణశాస్త్రి, ఆరువూదలు భావగీతాలకు పెట్టింది పేరైనట్లుగా చలామణి అవుతుంటే దాశరథి తనదైన పంథాలో వీణపాటలకు, భక్తి పాటలకు, ఖవ్వాలి పాటలకు కేరాఫ్ అడ్రస్8 అయ్యారు. ఇంకా ప్రకృతిలోని వెన్నెల, చందమామ, పూలసంపదను తన పాటల్లో విరివిగా కవితాత్మకంగా వినియోగించుకున్నారు. బ్రాండ్‌కు భిన్నంగా కూడా పాటలు రాయగలిగింది దాశరథి ఒక్కరే.

ఇతి వృత్తంలో వైవిధ్యం ఉన్న పాటలు రాయడం కూడా దాశరథి వారి ప్రత్యేకత. ‘పునర్జన్మ’ (1963)లోని ‘దీపాలు వెలిగే, పరదాలు తొలిగే’, ‘కన్నెవయసు’ (1973)లోని ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాటలు ఆ రోజులోన్లే సంగీత ప్రపంచంలో మారుమోగాయి. అంతకు ముందరి ‘పాడెద నీ నామమే గోపాలా’ (అమాయకురాలు-1971) పాట తరతరాలుగా ఆడపిల్లలకు అభిమాన గీతమైంది. ‘మీ కోసం నీ కోసం నా గానం నా ప్రాణం నీ కోసం’ (పునర్జన్మ), ‘కన్ను మూసింది లేదు, నిన్ను మరిచింది లేదు, నీ తోడు’ (మనుషులు, మమతలు) అనే రెండు పాటలైతే విరహ ప్రేమికులకు ఆ రోజుల్లో తారక మంత్రాల్లా పనిచేశాయి.

ప్రధానంగా ఆదుర్తికి ఆత్రేయలాగ దాశరథి తనకు ‘ఆస్థానకవి’గా పాటలు రాశారు. ‘ఓ బొంగరాల బుగ్గలున్న దాన’ (డాక్టర్ చక్రవరి), ‘గోదారి గట్టుంది, గట్టుమీద సెట్టుంది’ (మూగ మనసులు), ‘నీవు రావు నిదుర రాదు’ (పూలరంగడు), ‘దివినుంచి భువికి దిగివచ్చే’ (తేనె మనుసులు), ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ (మంచి మనసులు), ‘అందెను నేడే అందని జాబిల్లి’ (ఆత్మగౌరవం), ‘ఒకటే హృదయం కోసం’ (చదువుకున్న అమ్మాయిలు) వంటి ఆణిముత్యాల్లాంటి పాటలు ఇంకెన్నో.


దాశరథి వ్యక్తిత్వ పరిమళాన్ని తెలియజెప్పే ఒక సంఘటన. అప్పట్లో సామాజిక ప్రయోజనాన్ని ఆశించి ఆదుర్తి చక్రవర్తి చిత్ర బ్యానర్‌పై ‘సుడిగుండాలు’ సినిమా తీస్తున్నప్పుడు స్వాతంత్య్ర పోరాటం, దేశభక్తి గురించి దాశరథి ఒక పెద్ద పాటను రోజుల తరబడి కూర్చొని రాశారు. దానికి ఆదుర్తి రెట్టింపు పారితోషికాన్ని ఆఫర్ చేయగా ‘‘నేను దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవాడిని. మీ నో ప్రాఫిట్ చిత్రానికి నేను పైసా తీసుకోను. ఉచితంగా పాట రాసిస్తా’’ అన్నారు. అలాగే, ‘రాం రహీం’ చిత్రంలో ‘యూనాని హకీం హూ’ అని ఉర్దులో పాట రాసి మహ్మద్ రఫి ప్రశంసలు అందుకున్నారాయన.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గర్జించిన దాశరథి సినిమాల్లోనూ వీణపాటల స్పెషలిస్ట్ అయ్యారు. ‘మదిలో వీణలు మ్రోగే’ (ఆత్మీయులు), ‘మ్రోగింది వీణ పదేపదే హృదయాలలోన’ (జమిందారుగారి అమ్మాయి) పాటలను పాడుకోని వారుండరు. ‘దొరబాబు’లో ‘ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే’, ‘ఆడపడుచు’లోని ‘అన్నా! నీ అనురాగం’ పాటలు అన్నాచెప్లూల్ల ప్రేమ బంధానికి ప్రతీకలైనాయి. ఆయన రాసిన మొత్తం పాటలు సుమారు 500.

దాశరథి ‘ఆకాశవాణి’లో కార్యక్షికమాల నిర్వహకుడిగా పనిచేశారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడే సినిమాలకు రాయడం మొదలైనా మదరాసు బదిలీపై వెళ్లి పూర్తి కాలం పాటలు రాయడానికి ఆ రేడియో ఉద్యోగాన్ని వదులుకున్నారు. కానీ, ఆయన అంచనాల మేరకు సినిమా రంగం ఆయనను వినియోగించుకోలేకపోయింది. అయితే, అప్పటికే ఆయన రాసిన వందలాది పాటలు తరతరాల పాటు ఆయనకు తరగని కీర్తిని ఆర్జించిపెట్టాయి.

సినిమాల కోసం ఉద్యోగం వదులుకున్న ఆయన చివరి రోజుల్లో కొన్ని ఇబ్బందులకు గురయ్యారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో అధికారంలోకి వచ్చిన ఎన్టీరామారావు 1983లో ఆయనను ‘ఆస్థానకవి’ పదవి నుంచి తప్పించటంతో మనస్థాపం చెందారు. చివరకు 1987 నవంబర్ 5న భౌతికంగా మనకు దూరమయ్యారు. అయినా, ఆయన కవితా గర్జన నేటి తెలంగాణ బిడ్డలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. మరోవైపు తన సినీపాట సోయగం మనల్ని మరిపిస్తూనే ఉంది.

దాశరథి వారి మరిన్ని మధుర గీతాలు:
‘నడిరేయి ఏ జాములో’ (రంగులరాట్నం), ‘రారా కృష్ణయ్య’ (రాము), ‘తిరుమల మందిర సుందర’ (మేనకోడలు), ‘నను పాలింపగ నడిచి వచ్చితివా’ (బుద్ధ్దిమంతుడు) వంటివి దాశరథి రాసిన భక్తి గీతాలు కాగా, ‘ఓహో గులాబిబాల’ (మంచిమనిషి), ‘పాపాయి నవ్వాలి, పండగే రావాలి’ (మనుషులు మారాలి), ‘ముత్యాల జల్లు కురిసె’ (కథానాయకుడు), ‘ఆవేశం రావాలి, ఆవేదన కావాలి’ (మనసు మాంగల్యం), ‘ఎచటికోయి నీ పయనం’, ‘అందాలబొమ్మతో ఆటాడవా’ (అమరశిల్పి జక్కన), ‘అందాల ఓ చిలక’ (లేతమనుసులు), ‘చిన్నారి పొన్నారి నవ్వు’ (నాదీ ఆడజన్మే), ‘ఒక పూలబాణం రగిలింది మదిలో’ (ఆత్మగౌరవం), ‘మప్లూతీగ వాడిపోగా’ (పూజ) వంటి పాటలకు ఎన్నింటికో అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. అవి చిరస్థాయిగా ప్రజల గుండెలో చిరకాలం నిలిచిపోయాయి.